సీబీఐకి చిక్కిన కస్టమ్స్ అధికారులు.. ఇచ్చిపుచ్చుకున్నవారు అరెస్ట్

లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కారు కస్టమ్స్ అధికారులు. లంచం ఇచ్చినవారిని, పుచ్చుకున్నవారిని కూడా అధికారులు అరెస్ట్ చేసి రూ.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-10-08 02:33 GMT

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: కాకినాడ కస్టమ్స్‌కు చెందిన పలువురు అధికారులు లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. కాకినాడకి చెందిన శ్రీ చంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి భరత్ నుంచి రూ.3,18,200 లంచం తీసుకుంటుండగా పోర్టు కస్టమ్స్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ఆధారంగా పోర్ట్ అసిస్టెంట్ కమిషనర్, ఇతర కస్టమ్ అధికారుల నుంచి 27.74 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం పోర్ట్ అధికారుల నుంచి 31 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇక, విశాఖ సీబీఐ కోర్టులో నిందితులను హాజరు పరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ ఎస్పీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే లంచం ఇచ్చిన కాకినాడకు చెందిన శ్రీ చంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి పంతం భరత్ కుమార్‌ను కూడా అరెస్టు చేయడం కొసమెరుపు.


Similar News