చంద్రబాబు లేఖ నన్ను నిలువునా కుదిపేసింది: నారా భువనేశ్వరి భావోద్వేగం

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన లేఖపై నారా భువనేశ్వరి స్పందించారు.

Update: 2023-10-27 12:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన లేఖపై నారా భువనేశ్వరి స్పందించారు. జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ చంద్రబాబు లేఖ రాయడం తనను కలచివేసిందన్నారు.ఆ లేఖ తనను నిలువునా కుదిపేసిందని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు ఎదుర్కొంటున్న అవాంఛనీయ పరిస్థితులను తాము మొదటి నుంచి చెప్తూనే ఉన్నామని భువనేశ్వరి వెల్లడించారు. జైలు గోడల ఆవల ఉన్న నా భర్త క్షేమం కోసం నాతో కలిసి ప్రార్థించాలని రాష్ట్రంలోని సోదరీమణులందరినీ అర్థిస్తున్నాను అని అన్నారు. మనందరి సమిష్టి ప్రార్థనలు చంద్రబాబు చుట్టూ దుర్భేద్యమైన రక్షా కవచంలా నిలుస్తాయని.. ఆయనను ఈ కష్టాల నుంచి క్షేమంగా గట్టెకిస్తాయని నారా భువనేశ్వరి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు లేఖ ఆందోళన కలిగిస్తోంది: నారా బ్రాహ్మణి

చంద్రబాబు నాయుడు తన ప్రాణానికి ముప్పు ఉందంటూ జడ్జి కి రాసిన లేఖపై నారా బ్రాహ్మణి స్పందించారు.రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను, భద్రతా పరమైన సమస్యలను వివరిస్తూ చంద్రబాబు రాసిన లేఖ తమను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని అన్నారు. జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు క్షేమంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్లు నారా బ్రాహ్మాణి అన్నారు. 

Tags:    

Similar News