సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిల సంచలన ట్వీట్

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు....

Update: 2024-07-17 12:04 GMT

దిశ, ఏపీ బ్యూరో అమరావతి: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఉన్నాయని ఆమె ఎద్దేవా చేశారు. NDA కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన తమరు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు..? అని ప్రశ్నించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్‌ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు అని నిలదీశారు.

‘‘కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా మోడీతో గానీ ,ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారు?. గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా?. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించ గలిగారా?. పోలవరం ప్రాజెక్ట్‌కి నిధులపై స్పష్టత ఇచ్చారా?. రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా ఒడ్డు దాటేదాకా ఓడ మ‌ల్ల‌న్న‌.. దాటిన తర్వాత బోడి మ‌ల్ల‌న్న. ఇదే బీజేపీ సిద్ధాంతం. బాబు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచింది. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటుంది అని గుర్తిస్తే మంచిది.’’ అని షర్మిల ట్వీట్ చేశారు.


Similar News