అచ్యుతాపురం రియాక్టర్ ప్రమాదం.. 14కు చేరిన మృతులు

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది.

Update: 2024-08-21 14:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 50 దాకా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఎసెన్సియా ఫార్మా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో అక్కడిక్కడే ఏడుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరి పడటంతో వారి దేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. ప్రమాదం జరిగినపుడు కంపెనీలో దాదాపు 300 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నట్టు సమాచారం. పేలుడు తీవ్రతకు భవనం కుప్పకూలి భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. భారీ శబ్దానికి ప్రాణభయంతో కార్మికులు, సమీప గ్రామాల ప్రజలు పరుగులు తీశారు. 11 ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది కార్మికులు చిక్కుకొని ఉండవచ్చు అనే అనుమానంతో భారీ క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.    


Similar News