మరోసారి రెచ్చిపోయిన పూరన్.. గుజరాత్ దూకుడుకు బ్రేక్ వేసిన లక్నో
ఐపీఎల్-18లో గుజరాత్ టైటాన్స్ జోరుకు బ్రేక్ పడింది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో గుజరాత్ టైటాన్స్ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు విజయాలతో దూకుడు మీద ఉన్న ఆ జట్టుకు లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్పై 6 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది. లక్నోకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 స్కోరు చేసింది.
కెప్టెన్ గిల్(60), మరో ఓపెనర్ సాయి సుదర్శన్(56) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత గుజరాత్ తడబడటంతో 200 పరుగుల మార్క్ను అందుకోలేకపోయింది. 181 పరుగుల లక్ష్యాన్ని లక్నో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. భీకర ఫామ్లో ఉన్న నికోలస్ పూరన్ మరోసారి రెచ్చిపోయాడు. సిక్స్ల మోత మోగించాడు. 34 బంతుల్లో 61 రన్స్ చేశాడు. ఓపెనర్ మార్క్రమ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరి మెరుపులతో లక్నో విజయం దిశగా వెళ్లినప్పటికీ.. ఆఖర్లో లక్నో తడబడటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ, ఆయుశ్ బదోని(28 నాటౌట్) చివరి ఓవర్లో వరుసగా 4,6 దంచి లక్నో విజయాన్ని పూర్తి చేశాడు.