స్కూల్​ పిల్లల ఆటోను ఢీ కొట్టిన కారు... విద్యార్థి మృతి

స్కూల్ పిల్లలతో వస్తున్న ఆటోను కారు ఢీ కొట్టిన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు.

Update: 2024-09-17 15:30 GMT

దిశ, ములకలపల్లి : స్కూల్ పిల్లలతో వస్తున్న ఆటోను కారు ఢీ కొట్టిన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వీకే రామవరం, సుబ్బనపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు ఐదుగురు పాల్వంచ పట్టణంలోని డీఏవీ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నారు. పాఠశాల సమయం ముగియగానే తమ ఇండ్లకు ఆటోలో బయలు దేరారు. సుబ్బనపల్లి-సీతారాంపురం గ్రామాల మధ్య ఉన్న మొర్రేడు వాగు సమీపంలో ములకలపల్లి వైపునుంచి వస్తున్న కారు విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది.

     దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది. అందులో ఉన్న ఐదుగురు విద్యార్థులు తీవ్రగాయాలతో ఉండగా 108 వాహనంలో స్థానికులు పాల్వంచలోని ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇందులో రచ్చ ఈశ్వర్ అనే విద్యార్థి మృతి చెందినట్లు సమాచారం. ఇతర విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో కొత్తగూడెం, ఖమ్మం ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News