పుట్టినరోజు నాడే కానరాని లోకానికి…కెనడాలో మీర్ పేట్ వాసి మృతి

ఉన్నత చదువుల కోసమని కెనడా వెళ్లిన మీర్ పేట్ కు చెందిన ప్రణీత్( 27) ప్రమాదవశాత్తు సరస్సులో మునిగి మృతి చెందాడు.

Update: 2024-09-16 13:08 GMT

దిశ, మీర్ పేట్ : ఉన్నత చదువుల కోసమని కెనడా వెళ్లిన మీర్ పేట్ కు చెందిన ప్రణీత్( 27) ప్రమాదవశాత్తు సరస్సులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనతో మీర్ పేట్ లోని ప్రణీత్ నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ బాలాజీ నగర్ లో నివాసముండే అడుప. రవి సునీతలకు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం వీరు కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మృతుడు ప్రణీత్ 2019లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లగా తన సోదరుడు కూడా 2022 లో ఉన్నత చదువుల కోసమని కెనడా వెళ్ళాడు. ఆదివారం ప్రణీత్ పుట్టినరోజు కావడంతో తన సోదరుడితో పాటు తన స్నేహితులతో కలిసి టొరంటో సిటీ లోని లేక్లియర్ కు స్విమ్మింగ్ కు వెళ్లారు.

అక్కడ ప్రమాదవశాత్తు ప్రణీత్ సరస్సులో ఈతకు వెళ్లి మునిగిపోయి మృతి చెందాడు. అక్కడే ఉన్న సోదరుడు, స్నేహితులు కాపాడాలని ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. దీంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. నీటిలో మునిగి ప్రణీత్ మృతి చెందాడని అక్కడే ఉన్న సోదరుడు తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.దీంతో ఉన్నత చదువుల కోసమని వెళ్లిన తమ కుమారుడు పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకానికి వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. మృతి చెందిన తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియా కు త్వరగా తెప్పించాలని తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


Similar News