ICC World Cup 2023: అఫ్గనిస్తాన్‌ మ్యాచ్‌కు అతడు దూరం : బీసీసీఐ ప్రకటన

Update: 2023-10-09 11:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక అప్‌డేట్‌ అందించింది. అతడు చెన్నైలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని పేర్కొంది. భారత జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. డెంగ్యూ జ్వరం బారిన పడ్డ యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆరంభ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో మరో యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌‌ను కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా ఆస్ట్రేలియాతో పోరులో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

చెన్నైలో చెపాక్‌ మైదానంలో ఆసీస్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన రోహిత్‌ సేన తదుపరి ఢిల్లీలో అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. అరుణ్‌ జైట్లీ మైదానంలో అక్టోబరు 11న ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో గిల్‌ జట్టుతో పాటు దేశ రాజధానికి పయనం కానున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే, ఇంకా పూర్తిగా కోలుకోని కారణంగా శుబ్‌మన్‌ గిల్‌ జట్టుతో పాటు వెళ్లడం లేదని బీసీసీఐ సోమవారం క్లారిటీ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ‘‘టీమిండియా బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ జట్టుతో పాటు ఢిల్లీకి వెళ్లడం లేదు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు దూరమైన అతడు.. ఢిల్లీలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదు. అక్టోబరు 11 నాటి మ్యాచ్‌ ఆడే పరిస్థితి లేదు. వైద్య బృందం పర్యవేక్షణలో గిల్‌ ప్రస్తుతం చెన్నైలోనే ఉన్నాడు’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన విడుదల చేశారు.


Similar News