ICC World Cup 2023: భారత్ vs పాక్ పోరుకు సర్వం సిద్ధం.. టాప్ సెలబ్రిటీస్ హాజరయ్యే అవకాశం
న్యూఢిల్లీ : ప్రపంచ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. అంతేకాదు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను తిలకించేందుకు గోల్డెన్ టికెట్ హోల్డర్స్ (హై ప్రొఫైల్ సెలబ్రిటీలు) కూడా హాజరుకానున్నారు. ఇక క్రికెట్ పోటీ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే.. ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తుందని తెలిసిందే. అయితే వన్డే ప్రపంచకప్ హెడ్ టు హెడ్ మ్యాచ్ల్లో భారత్దే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఇరు జట్లు ఏడుసార్లు తలపడగా.. అన్నిసార్లూ టీమిండియానే విజేతగా నిలిచింది.
ఇదిలా ఉంటే.. భారత్ తమ ప్రపంచ కప్ ప్రయాణాన్ని ఆస్ట్రేలియాపై విజయంతో ప్రారంభించింది. మరోవైపు పాకిస్తాన్ సైతం ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలతో దూసుకుపోతోంది. కాగా, ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు సచిన్ టెండూల్కర్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్లకు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్లను అందజేసింది. ఈ మేరకు భారత్, పాక్ మధ్య జరిగే గేమ్ను చూసేందుకు చాలా మంది వీఐపీలు వస్తారని అంచనా వేస్తున్నారు. కాగా.. బాలీవుడ్ స్టార్స్ ఈవెంట్ శనివారం మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 1:10 గంటలకు ముగుస్తుంది. ఈ మ్యాచ్ కోసం పీసీబీకి చెందిన కొందరు అధికారులు కూడా ఎదురుచూస్తున్నారు.