బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం, హత్య.. హైస్కూల్ పక్కన్నే దారుణంగా..

by Bhoopathi Nagaiah |
బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం, హత్య.. హైస్కూల్ పక్కన్నే దారుణంగా..
X

దిశ, వెబ్‌డెస్క్ : బహిర్భూమి కోసం చెట్లల్లోకి వెళ్లిన యువతిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఒంటరిగా ఉన్న యువతిపై అఘాయిత్యానికి పాల్పడి మృతదేహాన్ని సమీపంలోని రైలు పట్టాల పక్కన పడేశారు. ఈ దారుణ ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘోరం శుక్రవారం తెల్లవారు జామున జరిగినా మధ్యాహ్నం తర్వాత వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లాకు చెందిన యువతి (21) ఇటీవల బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం సీతారాంపేటలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చింది. శుక్రవారం ఉదయం 5 :45 గంటలకు బహిర్భూమి కోసమని సమీపంలోని హైస్కూల్ వెనక ఉన్న రైల్వేట్రాక్ దగ్గరకు వెళ్లింది. అయితే ఆమె ఎంతకూ తిరిగిరాకపోవడంతో యువతి బంధువులు వెతకడం ప్రారంభించారు. ఇదే సమయంలో రైలు పట్టాల పక్కన విగతజీవిగా పడి ఉన్న యువతి గ్రామస్తుల కంటపడింది. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ పోలీసు బలగాలతో ఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి శరీరంపై గాయాలు ఉండటంతోపాటు ఆమెపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. యువతి కోసం వెతుకుతున్న బంధువులు మృతదేహాన్ని చూసి తన అమ్మాయేనని బోరున విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు.

సీఎం చంద్రబాబు సీరియస్.. రంగంలోకి హోంమంత్రి

కాగా, యువతి అత్యాచారం, హత్య విషయం సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయన సీరియస్ అయ్యారు. నిందితులు ఎంతటి వారినా వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. వెంటనే హోంమంత్రి వంగలపూడి అనితను ఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరుఫున అండగా నిలవాలని పురమాయించారు. హుటాహుటిన ఈపురుపాలెం వెళ్లిన హోం మంత్రి అనిత.. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. పోలీసులతో మాట్లాడి కేసు వివరాలను తెలుసుకున్నారు. విలైనంత త్వరగా నిందితులను గుర్తించాలని ఆదేశించారు. అనంతరం యువతి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.



Next Story