దిశ ఎఫెక్ట్...తహసీల్దార్​పై కేసు నమోదు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్...తహసీల్దార్​పై కేసు నమోదు
X

దిశ, పర్వతగిరి : అక్రమ భూ పట్టా చేసిన తహసీల్దార్​పై కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్సై భోగం ప్రవీణ్ కుమార్ తెలిపారు. వ్యక్తి బతికి ఉండగానే చనిపోయినట్లుగా చిత్రీకరించి తన పేరు పై ఉన్న భూమిని వేరే వాళ్ల పేరుపై పట్టా మార్పిడి చేశారని, వడ్లకొండ గ్రామానికి చెందిన ఎర్రం మల్లయ్య అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన ఎర్రం మల్లయ్యకు సర్వే నెం. 185/7/1 లో ఎకరం 25 గుంటల వ్యవసాయ భూమి ఉందని, గతంలో తీసుకున్న క్రాఫ్ లోన్ కు సంబంధించి రుణమాఫీ కాలేదని, ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన రైతులకు పీఎం కిసాన్ యోజన పథకం డబ్బులు రాలేదని స్థానిక బ్యాంకు అధికారులను, వ్యవసాయ అధికారులను సంప్రదించాడు. దాంతో వారు నీ పేరు పైన భూమి లేదని తెలిపారు.

మీ భూమిని ఎవరికో అమ్ముకున్నారని, బ్యాంకులో తీసుకున్న క్రాప్​ లోన్ డబ్బులు కట్టాల్సిందని బ్యాంకు అధికారులు వెల్లడించారు. వేరే వారికి పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని వ్యవసాయ అధికారులు తెలపడంతో ఖంగుతిన్న రైతు రెవెన్యూ అధికారులకు, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం తెలుసుకొని మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. రైతు బతికి ఉండగానే చనిపోయినట్లు ధ్రువీకరణ చేసిన తహసీల్దార్ తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై భోగం ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో అజ్మీరా కోమి పర్వతగిరి తహసీల్దార్​గా పనిచేశారు. ఈ క్రమంలో వడ్ల కొండ గ్రామానికి చెందిన ఎర్రం మల్లయ్యకు చెందిన ఎకరం 25 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన తన బంధువు ఎర్రం దూడయ్యకు అక్రమ పట్టాచేశారు. తాను బతికుండగానే చనిపోయినట్లు ధ్రువీకరించి, పట్టా చేసినందుకు అప్పటి తహసీల్దార్ కోమితో పాటు ఎర్రం దూడయ్య, సహకరించిన గ్రామస్తులు వెంకటేశ్వర్లు, రాజు, హప్సర్ పాషలపై కేసు నమోదు చేసినట్టు ఎస్​ఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed