వాజ్‌పేయి గొప్ప నేత.. మోడీలా ఎన్నడూ నోరు పారేసుకోలేదు : ప్రియాంకా గాంధీ

by Dishanational4 |
వాజ్‌పేయి గొప్ప నేత.. మోడీలా ఎన్నడూ నోరు పారేసుకోలేదు : ప్రియాంకా గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగంలో కీలక మార్పులు చేస్తామని, స్వయంగా బీజేపీ నేతలే మీడియా ఎదుట చెబుతున్నారని ఆమె గుర్తు చేశారు. గుజరాత్‌లోని వల్సాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అనంత్ పటేల్‌కు మద్దతుగా ప్రియాంక శనివారం ప్రచారం చేశారు. వల్సాద్ జిల్లాలోని ధరంపూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల మంటకు మోడీ పాలనా వైఫల్యమే కారణమని ప్రియాంక విమర్శించారు. ప్రధాని మోడీని ‘మెహంగాయీ మ్యాన్’ అని పిలిస్తే బాగుంటుందని ఆమె కామెంట్ చేశారు. ‘‘బీజేపీ నేతలు ప్రధాని మోడీ శక్తిమంతుడు అని పొగుడుతుంటారు. మోడీ చిటికె వేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని చెబుతుంటారు. అలాంటప్పుడు ఆయన మన దేశ పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నారు?’’ అని ప్రియాంక ప్రశ్నించారు. ‘‘సార్వత్రిక ఎన్నికల వల్లే ప్రధాని మోడీ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గించారు. అంతేతప్ప ఆయనకు ప్రజలపై సానుభూతి లేదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

విద్య, ఆరోగ్యం, ద్రవ్యోల్బణం గురించి మోడీ మాట్లాడరు

విద్య, ఆరోగ్యం, ద్రవ్యోల్బణం వంటి అంశాల గురించి ప్రధాని మోడీ ఎప్పుడూ మాట్లాడరని, అవంటే ఆయనకు భయమని ప్రియాంక అన్నారు. అందుకే హిందూ-ముస్లిం, విశ్వగురు వంటి అంశాలను మోడీ లేవనెత్తుతున్నారని ఆమె చెప్పారు. ‘‘ఈవిధంగా అబద్ధాలు చెప్పే తొలి భారత ప్రధాని మోడీయే. మా అమ్మ, అమ్మమ్మ, తాత, సోదరుడు (రాహుల్ గాంధీ), నా భర్త సహా అందరిపై మోడీ దుర్భాషలాడారు. అయినా మేం ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆయన చెప్పదల్చుకున్నవ్వన్నీ చెప్పనిచ్చాం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎంతో సభ్యత కలిగిన గొప్ప నాయకుడు. వాజ్‌పేయి ఎన్నడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు’’ అని ప్రియాంక తెలిపారు.



Next Story

Most Viewed