జూమ్ ఫ్రీ యూజర్లకు ఆ సౌకర్యం లేదు!

by  |
జూమ్ ఫ్రీ యూజర్లకు ఆ సౌకర్యం లేదు!
X

కరోనా లాక్‌డౌన్ కారణంగా చాలా కంపెనీలు జూమ్ యాప్‌ ద్వారానే తమ కార్యకలాపాలు సాగించాయి. అయితే మొదట్లో అందులో సెక్యూరిటీ బాగోలేదని, సమాచారం లీకవుతోందని తెలియడంతో మళ్లీ జూమ్ యాప్ క్రేజ్ తగ్గింది. ఈ మాటలను ఛాలెంజ్‌గా తీసుకున్న జూమ్.. భద్రతా ఫీచర్లను అప్‌డేట్ చేసింది. అందులో భాగంగా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు పెయిడ్ యూజర్లకు మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయాన్ని అందజేయబోతున్నట్లు జూమ్ సీఈవో ఎరిక్ యువాన్ వెల్లడించారు.

అంటే ప్రస్తుతం ఉచితంగా జూమ్ సేవలను పొందుతున్న మిలియన్ల మందికి ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. వీడియోకాల్ ద్వారా జరిగిన మీటింగ్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేకపోతే ఆ కాల్‌లో చర్చించిన అంశాలు మూడో వ్యక్తికి తెలిసే అవకాశాలు ఎక్కువ. ఇది కూడా ఒక రకమైన సెక్యూరిటీ ఇబ్బందే. అయితే తాము ఇలా చేయడానికి గల కారణాలను కూడా ఎరిక్ ప్రస్తావించారు. ప్రస్తుతం అమెరికాలో జాతి వివక్ష నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో జూమ్ ద్వారా విధ్వంస ప్రేరేపిత సమాచారాన్ని ఉచితంగా పంచుకునే అవకాశం ఉంది. సాధారణంగా పెయిడ్ యూజర్లు ఇలాంటి పనులు చేయరు. ఇలా చేసేది కేవలం ఫ్రీ యూజర్లు మాత్రమే కాబట్టి, ఎఫ్‌బీఐ ఇంకా స్థానిక పోలీసులకు సహకరించే ఉద్దేశంతో తాము ఈ సదుపాయానికి పరిమితి విధించినట్లు ఎరిక్ స్పష్టం చేశారు.

ఓ వైపు భద్రతను కల్పిస్తూనే, తాము అందించే సదుపాయాలు తప్పుగా వినియోగించడాన్ని కట్టడి చేసేందుకు తీసుకున్న ఒక సమతుల్య చర్యగా దీన్ని జూమ్ సెక్యూరిటీ కన్సల్టంట్ అలెక్స్ స్టామోస్ వర్ణించారు. ఫ్రీ ఖాతాల ద్వారా ఎవరైనా తప్పుడు పనులు చేస్తే పట్టుకోవడం కష్టం కాబట్టి, తాము ఇలా చేసినట్లు అలెక్స్ సమర్థించుకున్నారు.


Next Story

Most Viewed