"వైఎస్సార్సీపీ మాది.. వాళ్లది యువజనశ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ"

by  |
వైఎస్సార్సీపీ మాది.. వాళ్లది యువజనశ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
X

దిశ ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ కాబడిన పార్టీ “అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ” అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మహబూబ్ బాషా, రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ తెలిపారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు షోకాజ్ నోటీసుకు వివరణ ఇస్తూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో వైఎస్సార్సీపీ ఉనికిని ప్రశ్నిస్తూ, పలు ప్రశ్నలు సంధించారు. నేపథ్యంలో అన్న వైఎస్సార్సీపీ నేతలు కర్నూలులో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్నది “యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ” అని చెప్పారు. అధికార బలం ఉన్న ఆ పార్టీ నేతలు తమ పార్టీ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై 2015లోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

దీంతో అప్పట్లోనే కేంద్ర ఎన్నికల సంఘం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేతలు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు వాడకూడదని ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ కాబడిన తమ అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2015 నుంచి పలు ఎన్నికల్లో పోటీ చేస్తోందని, అశేషమైన ప్రజాభిమానం సంపాదించిందని కూడా చెప్పారు. అయితే అధికార పార్టీ పెద్దలు తమ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడంతో తాము స్వేచ్ఛగా తమ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పేరు వాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో బలమైన కార్యకర్తలున్నారని అన్నారు. ఇటీవల మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. అయితే అధికార పార్టీ నేతలు తమ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశామని అన్నారు. తమ పార్టీ అబ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరామని తెలిపారు. నిజమైన వైఎస్సార్ అభిమానులంతా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర్రెడ్డి ఆశయ సాధన కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికైనా అధికారంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకోవడం మానుకోవాలని సూచించారు. లేని పక్షంలో తాము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపుతామని ప్రకటించారు.



Next Story

Most Viewed