మా ముఖ్యమంత్రి ఎక్కడ ?

by  |
మా ముఖ్యమంత్రి ఎక్కడ ?
X

దిశ, న్యూస్‌బ్యూరో: ‘వేర్ ఈజ్ కేసీఆర్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి ఆచూకీ కోసం రెండు మూడు రోజులుగా ట్వీట్ మెసేజ్‌లు వెలువడుతున్నాయి. తీన్మార్ మల్లన్న ఏకంగా హైకోర్టులో ఒక పిటిషన్‌నే దాఖలుచేశారు. ఇదే సమయంలో ఓ యువకుడు ఏకంగా కేసీఆర్‌ను వెతుక్కుంటూ అధికార నివాసమైన ప్రగతి భవన్‌కు వచ్చారు. ‘వేర్ ఈజ్ కేసీఆర్? హి ఈజ్ మై సీఎం. ఇట్ ఈజ్ మై రైట్ టు నో’ (ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ? ఆయన మా ముఖ్యమంత్రి. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం నా హక్కు) అని రాసి ఉన్న ప్లాకార్డును ప్రగతి భవన్ ఎగ్జిట్ గేటు ముందు ప్రదర్శించాడు. ఇప్పటిదాకా సోషల్ మీడియా (ట్విట్టర్)లో మాత్రమే సంచలనంగా మారిన ‘వేర్ ఈజ్ మై కేసీఆర్’ ఇప్పుడు ఏకంగా ఫిజికల్‌గా ప్రగతి భవన్ దాకా చేరుకుంది. అలా ప్రదర్శించిన ప్లాకార్డుపై ఆ యువకుడు ఏం రాశాడో, ఏం ప్రదర్శిస్తున్నాడో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి కొద్దిసేపు అర్థం కాలేదు.

ఆ ప్లాకార్డుపై ఉన్న అక్షరాలను చదవడానికి ఓ మహిళా పోలీసు పరుగులు పెట్టినా అప్పటికే ఆ యువకుడు మెరుపు వేగంతో పారిపోయాడు. ఒకే బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారని, ఒకరు ఎగ్జిట్ గేటు దగ్గర ప్లాకార్డును ప్రదర్శిస్తుండగా మరో యువకుడు బైక్‌ను ఆన్‌లోనే ఉంచారని, పోలీసులు దగ్గరికి చేరుకుంటుండడంతో వెంటనే ప్లాకార్డును తనతోపాటే తీసుకుని బైక్ ఎక్కి వెళ్ళిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేసినా దొరకలేదు. దీంతో నగర ట్రాఫిక్ విభాగం అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారు వాడిన బైక్, వారి ముఖ కవళికలను ఆధారంగా తీసుకుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా యువకుడు ప్రగతి భవన్ గేటు దగ్గరకే వచ్చి ప్లాకార్డును ప్రదర్శించడం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.



Next Story