ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఆ దేశ ప్లేయర్ అరెస్టు

by Shyam |
RG
X

దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. మహిళల డబుల్స్ కేటగిరీలో ఒక మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలతో ఒకరిని ఫ్రాన్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ధృవీకరించారు. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సమయంలో రొమేనియాకు చెందిన ఆండ్రియా మితు, పాట్రిషియా మారికి రష్యాకు చెందిన యానా సిఝికోవా, అమెరికాకు చెందిన మాడిసన్ బ్రింగెల్ మధ్య మహిళల డబుల్స్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌ను రష్యాకు చెందిన యానా సిఝికోవా ఫిక్సింగ్ చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేష్‌తో కలసి చేసిన దర్యాప్తులో యానా సిఝికోవాకు ఫిక్సింగ్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే అప్పటికే ఆమె ఫ్రెంచ్ ఓపెన్ ముగియడంతో స్వదేశం రష్యాకు వెళ్లిపోయింది. అయితే ఈ విషయాన్ని దర్యాప్తు బృందాలు రహస్యంగా ఉంచాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్, అవినీతి ఆరోపణల కేసులు సిఝికోవాపై నమోదు చేశారు.

పోలీసుల అదుపులో..

గత ఏడాది మ్యాచ్ ఫిక్సింగ్‌పై దర్యాప్తు జరుగుతున్న విషయం తెలియని రష్యా క్రీడాకారిణి యానా సిఝికోవా ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొనడానికి పారిస్ చేరుకున్నది. విషయం తెలుసుకున్న దర్యాప్తు బృందాలు రోలాండ్ గారోస్ వద్ద ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. ఆమెను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపైనే అదుపులోనికి తీసుకున్నట్లు ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ విషయాన్ని రష్యన్ టెన్నిస్ ఫెడరేషన్‌కు కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన వివరాలను రష్యన్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు షామిల్ తర్పిశ్చేవ్‌కు పంపించినట్లు సమాచారం. పారిస్‌లోని రష్యన్ ఎంబసీ అధికారులకు కూడా సిఝికోవాను డిటెన్షన్ చేసినట్లు వివరాలు పంపించారు. అయితే సిఝికోవా తప్పు చేసిందా లేదా అనేది ఫ్రెంచ్ పోలీసులు పంపిన డాక్యుమెంట్లలో స్పష్టంగా లేదని షామిల్ తర్పిశ్చేవ్ అంటున్నారు. ఈ కేసులో ఎక్కడో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందని.. యానా తప్పు చేసి ఉంటే తిరిగి ఫ్రాన్స్ ఎందుకు వెళ్తుందని రష్యన్ టెన్నిస్ ఫెడరేషన్ అధికారులు అంటున్నారు. కాగా, ప్రస్తుతానికైనే సిఝికోవాను ఫ్రాన్స్ వదిలి వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

వెనుక ఉన్నది ఎవరు?

క్రికెట్ వంటి బృంద క్రీడలో ఎన్నో ఏళ్ల నుంచి ఫిక్సింగ్ జరుగుతున్న ఘటనలు ఉన్నాయి. ఎంతో మంది క్రికెటర్లు ఈ ఫిక్సింగ్ ముఠాల చేతిలో చిక్కుకొని తమ కెరీర్స్ నాశనం చేసుకున్నారు. అయితే టెన్నిస్‌లో ఫిక్సింగ్ అనేది అరుదుగా జరిగే విషయమే. వ్యక్తిగత క్రీడగా పేరున్న టెన్నిస్‌లో ఫిక్సింగ్ చేస్తే అది స్పష్టంగా తెలిసి పోతుంది. అయితే ఇండియాకు చెందిన బుకీ ఒకరు క్రికెట్‌తో పాటు టెన్నిస్ మ్యాచ్‌లను కూడా ఫిక్సింగ్ చేస్తున్నట్లు గతంలోనే ఐసీసీ ఏసీయూ గుర్తించింది. పంజాబ్‌కు చెందిన ఈ బుకీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డబ్ల్యూటీఏ, ఏటీపీ మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు గతంలో ప్రయత్నించినట్లు ఇటీవల ఢిల్లీ పోలీసులు దర్యాప్తులో కూడా వెల్లడైంది. ఫ్రెంచ్ ఓపెన్‌లోప్రస్తుతం ఫిక్సింగ్ కలకలం రేగడంలో దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయంపై లోతుగా దర్యాప్తు జరుగుతున్నది. రష్యన్ ఫిక్సింగ్ ముఠాలు లేదా ప్రపంచవ్యాప్తంగా గతంలో ఫిక్సింగ్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తుల క్రిమినల్ రికార్డులను ఫ్రాన్స్ పోలీసులు తెప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియాకు చెందిన బుకీ వివరాలపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తున్నది. ఏదేమైనా ఫిక్సింగ్ బూతం చివరకు టెన్నిస్‌ను కూడా వదలక పోవడంపై అభిమానులు ఆందోలన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed