తహసీల్దార్‌పై మహిళ ఫిర్యాదు

by  |
తహసీల్దార్‌పై మహిళ ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: వారసత్వంగా సంక్రమించిన భూములను ఇతరుల పేరిట మ్యుటేషన్ చేసిన తహసీల్దార్, వీఆర్వో‌లపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నల్లగొండ జిల్లా హాలియా మండలం మారేపల్లికి చెందిన కుడికల్ల యాదమ్మ చేసిన ఫిర్యాదు ప్రకారం..

యాదమ్మ తండ్రి రేవల్లి నర్సయ్య పేరిట సర్వే నెంబర్ 301/23 లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆమె తండ్రి 12 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. తల్లి నర్సమ్మ అదే భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ భూమి 1976 నుంచి 2018 వరకు తన తండ్రి పేరు మీదనే ఉందని, తన తల్లి, తన పేరు మీదకు మర్చాలని తహసీల్దార్, వీఆర్వోలకు పలు పర్యాయాలు ఆర్జీ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని యాదమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు అవినీతికి పాల్పడి అమ్జద్ అనే వ్యక్తి పేరిట భూమిని మార్పిడి చేశారని ఆమె ఆరోపించింది.

ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే లంచం డిమాండ్ చేశారని, రూ 50 వేలు తీసుకుని కేవలం రెండు ఎకరాలు మాత్రమే తిరిగి తమ పేరు మీదకు మార్పిడి చేశారని, మిగిలిన రెండు ఎకరాల సంగతేంటని అడిగితే భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న వ్యక్తితో కలిసి తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెడతామని బెదిరిస్తున్నారని యాదమ్మ తెలిపింది. ఈ విషయంలో విచారణ నిర్వహించి తమకు న్యాయం చేయాలని యాదమ్మ మానవ హక్కుల కమిషన్‌ను కోరింది.



Next Story