యాదాద్రి ఆధ్యాత్మికం, ఆహ్లాదకరం

by  |
యాదాద్రి ఆధ్యాత్మికం, ఆహ్లాదకరం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడవులను కాపాడటంతో పాటు పచ్చదనాన్ని పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అటవీ ప్రాంతాల్లోనే కాకుండా హైదరాబాద్‌కు సమీప ప్రాంతాల్లోనూ అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కొన్ని పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల చౌటుప్పల్ సమీపంలోని లక్కారంలో తంగేడువనం ప్రారంభించిన వారం రోజుల వ్యవధిలోనే యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని రాయగిరిలో మరో రెండు అర్బన్ పార్కులను రూపొందించింది.

పునరుజ్జీవన చర్యలు..

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రీశుడి క్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నది. దాంతో ఇక్క‌డికి వ‌చ్చే యాత్రికుల‌‌తో పాటు ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని అందించాల‌నే ఉద్దేశంతో ఆఫీసర్లు రాయ‌గిరి రిజ‌ర్వు ఫారెస్ట్ బ్లాకులో న‌ర్సింహా అర‌ణ్యం, అంజ‌నేయ అర‌ణ్యం అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌ను అభివృద్ధి చేశారు. క్షీణించిన అడ‌వుల‌ పునరుజ్జీవన ‌చ‌ర్య‌ల్లో భాగంగానే ఈ ఎకో టూరిజం పార్కులను ఏర్పాటు చేసినట్లుగా అధికార యంత్రాంగం చెబుతోంది. ఎకో టూరిజం పార్కు ఏర్పాటులో భాగంగా వినూత్న పద్ధతిలో పార్కుల‌ను తీర్చిదిద్దారు. నేచ‌ర్ థీమ్‌తో న‌ర్సింహా, అంజ‌నేయ‌ అర‌ణ్యంల‌ ఎంట్రీ ప్లాజా‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌కృతి, జీవావ‌ర‌ణ వ్య‌వ‌స్థ గురించి ఆసక్తిని కలిగించేలా ఈ పార్కుల‌ను నిర్మించారు.

పచ్చదనంతో ఆహ్లాదకరంగా..

గతంలో రాళ్లు, రప్పలతో ఉన్న ప్రాంతం ఇవాళ పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారింది. రాయ‌గిరి – II రిజ‌ర్వు ఫారెస్ట్ బ్లాక్‌లో ఉన్న యాదాద్రి టెంపుల్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ రేంజ్‌ను న‌ర్సింహా అర‌ణ్యంగా పిలుస్తున్నారు. ఈ బ్లాక్‌లో 4 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో 97.12 హెక్టార్ల‌లో రూ.3.61 కోట్ల వ్యయంతో న‌ర్సింహా అర‌ణ్యం, రాయ‌గిరి -I ‌రిజ‌ర్వు ఫారెస్ట్ బ్లాక్‌లో 3.6 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో 56.65 హెక్టార్ల‌లో రూ.2.83 కోట్ల వ్యయంతో అంజ‌నేయ‌ అర‌ణ్యం అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌ను స‌ర్వాంగ సుంద‌రంగా రూపొందించారు. కాగా, ఆంజనేయ అరణ్యంలోని జలపాతానికి యాదమునికి గుర్తుగా యాదాశ్రీ అని పేరు పెట్టారు. ఇదిలా ఉండగా, హైద‌రాబాద్ న‌లువైపులా, ఇత‌ర ప‌ట్ట‌ణాల‌కు దగ్గర్లో ఉండే అటవీ భూములను గుర్తించి వాటిల్లో కొంత భాగాన్ని అర్బన్ లంగ్‌ స్పేస్‌లుగా, అర్బ‌న్ ఫారెస్ట్, ఎకో టూరిజం పార్కులుగా సర్కారు అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రకృతి పట్ల అవగాహన కోసం..

ఎకో టూరిజం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ప్ర‌కృతి, ప‌ర్యావ‌ర‌ణం, జీవావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ ప్రాధ‌న్య‌త, వాటి ప‌ట్ల అవ‌గాహన క‌ల్పించేందుకు విజిట‌ర్ జోన్‌ను తీర్చిదిద్దారు. న‌ర్సింహా అర‌ణ్యం పార్కులో అవెన్యూ ప్లాంటేష‌న్‌తో కూడిన వాకింగ్ ట్రాక్స్, ఏనిమ‌ల్ డెన్స్, సాక్రేడ్ ఏనిమ‌ల్స్, వ్యూ పాయింట్స్, గ‌జీబో, హంపిథియేటర్, డీర్ రెస్క్యూ సెంట‌ర్, ఎంట్రీ ప్లాజా, నేచ‌ర్ ట్ర‌య‌ల్స్ టు ద టెంపుల్ ఆన్ టాప్ ఆఫ్ ద హిల్, పార్కింగ్ ఏరియా, రాక్ గార్డెన్, సీటింగ్ లొకేషన్స్, ప్లాంటేష‌న్, ఫెన్సింగ్, వాష్ రూంల‌ను ఏర్పాటు చేశారు. అంజ‌నేయ అర‌ణ్యంలో గ‌జీబో, వాకింగ్ ట్రాక్స్, థీమ్ పార్క్స్, సెల్ఫీ పాయింట్, వాట‌ర్ ఫాల్, రాక్ గార్డెన్స్, బ‌హుబ‌లి వాచ్ ట‌వ‌ర్, వాక్ ఓవ‌ర్ బ్రిడ్జెస్, నేచ‌ర్ ట్రయ‌ల్స్, సీటింగ్ బెంచెస్‌ను ఏర్పాటు చేశారు. వీటికి తోడు అరుదైన మొక్కలు, మెడిస‌న‌ల్ ప్లాంట్స్, వివిధ ర‌కాల పూల మొక్క‌ల‌తో సంద‌ర్శ‌కుల‌కు ఆహ్లాదాన్ని అందించేలా అద్భుతంగా వీటిని అభివృద్ధి పరిచారు. కుటుంబ స‌భ్యుల‌తో సరదాగా గడిపేలా అందరికీ ఆహ్లాదాన్ని అందించేలా ఈ పార్కుల‌ను అభివృద్ధి చేశారు.



Next Story

Most Viewed