యువతిపై 5వేలసార్లు అత్యాచారం..

by  |
యువతిపై 5వేలసార్లు అత్యాచారం..
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. బాధిత యువతి నుంచి అందిన ఫిర్యాదును చూసిన పంజాగుట్ట పోలీసులకు కళ్లు బైర్లు కమ్మాయి. ఈ కేసును ఎలా విచారించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. కొన్నేండ్లుగా వేర్వేరు సందర్భాలలో తనను 139 మంది 5 వేల మార్లు లైంగికంగా వేధించారని, బలవంతంగా అనుభవించారని, అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మిర్యాలగూడకు చెందిన ఓ దళిత యువతి (25 ఏళ్లు) గురువారం ఫిర్యాదు చేశారు. సెక్స్‌కు అంగీకరించకుంటే చంపుతామంటూ బెదిరించారని పేర్కొన్నారు. భర్త తరపు బంధువులతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు, రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందిన వారితో పాటు పలువురు వ్యాపారులు కూడా ఉన్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మొత్తం 139 మందిపై పంజాగుట్ట పోలీసులు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద, ఎస్సీ-ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంకు చెందిన దళిత యువతికి (ఉద్దేశపూర్వకంగానే బాధితురాలి పేరును గోప్యంగా ఉంచుతున్నాం) మిర్యాలగూడ హౌసింగ్ బోర్డుకు చెందిన కొండారెడ్డి రమేష్‌తో 2009లో వివాహమైంది. మూడు నెలల తర్వాత భర్త తరపు చెల్లెలు, సోదరుడు, తండ్రి ఇతర బంధువులు మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో 2010 డిసెంబర్‌లో విడాకులు పొందారు. సొంతూరు శెట్టిపాలెం చేరుకుని చదువుపై దృష్టి పెట్టింది. మిర్యాలగూడెంలోని కళాశాలలో తిరిగి తన చదువును కొనసాగించింది. అయితే, తనను ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు మీసాల సుమన్, బాలు, అశోక్, ఆంజనేయులు, నాగు నాయక్‌తో పాటు, సినీ హీరో వినాయకుడు కృష్ణ, టీవీ యాంకర్ ప్రదీప్, మాజీ ఎంపీ కవిత పీఏ సంతోష్ రావు, టీఆర్ఎస్ భరత్, టీవీ 5 మధు తదితర రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు ఇతర అనేక మంది లైంగికంగా వేధించారని, బలవంతంగా సెక్సువల్ గా అనుభవించినట్టు ఆ ఫిర్యాదులో యువతి పేర్కొన్నారు.

తెలంగాణతో పాటు ఆంధ్రపదేశ్, బెంగుళూరు, చెన్నయ్, గోవా, మహారాష్ట్ర, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాలకు చెందిన వారు సుమారు 139 మంది దాదాపు 5 వేలకు పైగా పలు సందర్భాల్లో బలవంతంగా అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్స్‌కు అంగీకరించకుంటే చంపుతామంటూ మారణాయుధాలతో బెదిరించారని తెలిపారు. కులం పేరుతో దూషించారని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కూడా దూషించారని బాధితురాలు తన ఫిర్యాదులో వివరించారు. తాను నగ్నంగా ఉన్న సందర్భాల్లో వేలాది వీడియోలను మొబైల్‌లో చిత్రీకరించారని, కొన్ని తనకే పంపారని, వీటిని పోలీసులకు ఇస్తున్నట్లు ఫిర్యాదు సందర్భంగా తెలిపారు. కొన్ని వీడియోలను ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసినట్లు కూడా బెదిరింపుల సందర్భంగా తనకు చెప్పారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు అనంతరం తనను కచ్చితంగా చంపుతారని, ఈ ఫిర్యాదునే మరణ వాంగ్మూలంగా భావించాలంటూ పోలీసులకు వివరించారు. మరణాంతరం తన మృతదేహాన్ని సోమాజిగూడ ‘ది గాడ్ పవర్ ఫౌండేషన్’ అనే ఎన్జీవో సంస్థకు అప్పగించాలని కోరారు.

42 పేజీలతో ఎఫ్ఐఆర్ నమోదు

బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాలన్నింటినీ చేర్చడంతో ఎఫ్ఐఆర్ సుమారు 42 పేజీలైంది. ఇందులో ఏ-1 గా ఎస్ఎఫ్ఐ నాయకుడు మీసాల సుమన్‌తో పాటు పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు. వీరంతా దాదాపుగా మిర్యాలగూడెం పరిసర ప్రాంతానికి చెందిన వారుగా భావిస్తున్నారు. భర్త తరపు బంధువులతో పాటు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పీఏ సంతోష్ కుమార్, సినీ నటుడు కృష్ణుడు, యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నారు. కేసు విచారణను ఎలా ముందుకు తీసుకెళ్తారనే అంశం పోలీసులకు సవాలుగా మారింది. బాధితురాలు చెప్పినట్టుగా కేసు పూర్వాపరాలను క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, నిందితులను అందర్నీ అరెస్టు చేస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత మంది పేర్లు ఒక అత్యాచారం ఫిర్యాదులో, ఎఫ్ఐఆర్‌లో నమోదు కావడం తొలిసారి. ఈ సందర్భంగా 139 మంది నిందితులపై 376(2), 509, 354, 354(ఎ), 354(సి) ఐపీసీ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.


Next Story