విషం తాగి మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

by  |
విషం తాగి మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, ఏపీ బ్యూరో: దళితుల భూమిలో గ్రామ సచివాలయ నిర్మాణానికి యత్నించగా బాధితురాలు విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తూంచెర్ల గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో సచివాలయ నిర్మాణానికి అనువైన ప్రభుత్వ భూమి ఉన్నా పేద దళితులకు భూమి లేకుండా చేయాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. 378-1, 418-సీ సర్వే నంబర్లలోని 35సెంట్ల స్థలంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలు నిర్మించాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని చదును చేయగా బాధితులు వాగ్వాదానికి దిగారు. ఈ భూమి తమదేననీ, కొన్నేళ్లుగా తమ ఆధీనంలోనే ఉందనీ తెలిపారు.

ఆన్‌లైన్‌లోనూ తమ పేరుమీదే ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోక పోవడంతో మహిళా రైతు లక్ష్మీదేవి విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను స్థానికులు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.


Next Story