స్లీపింగ్ టాబ్లెట్స్‌తో భర్తను హతమార్చింది

by  |
స్లీపింగ్ టాబ్లెట్స్‌తో భర్తను హతమార్చింది
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిందో ఇల్లాలు. హత్య జరిగిన 15 రోజులకు హతమార్చిన విధానం ప్రియుడికి వివరిస్తున్న ఫోన్ కాల్ బట్టబయలు కావడంతో గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా సిఖినేటి పల్లిమండలంలోని ఉయ్యూరి వారి మెరకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే… ఉయ్యూరివారిమెరకకు చెందిన ఉప్పు ప్రసాద్‌కు కొన్ని సంవత్సరాల క్రితం ప్రశాంతితో వివాహం జరిగింది. తరువాత కాలక్రమంలో అదే ప్రాంతానికి చెందిన చొప్పల్ల శివతో ప్రశాంతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ బంధానికి భర్త అడ్డుగా మారాడని భావించిన ప్రశాంతి, శివలు అతనిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. శివ సహకారంతో ఈ నెల 2వ తేదీన స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి భర్తను హతమార్చింది. సహజ మరణంగా భావించిన బంధువులు ఖననం చేశారు. అయితే పదిహేను రోజుల తరువాత కుటుంబ సభ్యుల ద్వారా హతమార్చిన విధానానికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రసాద్ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.


Next Story

Most Viewed