సింగరేణి ఉద్యోగం : భార్యాబిడ్డల ఘాతుకం 

by  |
సింగరేణి ఉద్యోగం : భార్యాబిడ్డల ఘాతుకం 
X

దిశ, వెబ్ డెస్క్: భర్తను చంపేస్తే అతడి సింగరేణి ఉద్యోగం కొడుక్కి వస్తుందన్న దురుద్దేశంతో… ఓ భార్య తన బిడ్డలతో కలిసి భర్తను కిరాతకంగా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో ఈ నెల 4వ తేదిన జరిగింది. కారుణ్య ఉద్యోగం కోసం ఓ వ్యక్తిని కుటుంబసభ్యులే కిరాతకంగా చంపేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

బెల్లంపల్లి మండలంలోని పాతబెల్లంపల్లికి చెందిన ముత్తె శంకర్‌(57) సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా శంకర్‌ మూడునెలలుగా కుటుంబానికి దూరంగా మంచిర్యాలలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే చిన్న కుమార్తె స్వాతి కరోనా బారిన పడినట్లు, కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు కరోనా లక్షణాలున్నాయని ముత్తె శంకర్‌కు భార్య విజయ ఫోన్‌ చేసి చెప్పగా అతను ఇంటికి వచ్చాడు.

అదేరోజు రాత్రి ఇంట్లోనే నిద్రపోతున్న అతడిని భార్య, కుమారుడు, కుమార్తె, కుమార్తె ప్రియుడు… నలుగురు కలిసి గొంతుకు బెల్ట్ బిగించి హత్యచేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతుడి మెడకు చీరను కట్టి వేలాడదీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను తమదైన శైలిలో విచారించగా కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. కారుణ్య నియామకంతో కొడుక్కి ఉద్యోగం సాధించవచ్చన్న దురుద్దేశంతోనే శంకర్‌ను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.

ఇదే నేపథ్యంలో శంకర్‌ చెల్లెలు రుక్మిణి.. తన అన్న చావుపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేయగా బెల్లంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న భార్య, కుమారుడు, కుమార్తెను ఈ రోజు పక్కా సమాచారం మేరకు రూరల్ సిఐ జగదీష్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో ముగ్గరిని అరెస్టు చేసి విలేకరుల సమావేశంలో ఏసిపి యం.ఏ రహమాన్ వివరాలు వెల్లడించారు. పరారిలో ఉన్న కుమార్తె ప్రియుడు సాయిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు.


Next Story