మిర్యాలగూడ కేంద్రంగా రైతుల దగా?

by  |
మిర్యాలగూడ కేంద్రంగా రైతుల దగా?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: వర్షాలు సమృద్ధిగా పడి ప్రాజెక్టులు జలకళతో నిండిపోగా.. రైతులు ఉత్సాహంగా వరినాట్లు వేశారు. అందరికి అత్యవసరమైన యూరియా ధరలకు రెక్కలు రావడం వల్ల పెట్టుబడి భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. కరోనా వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటగా.. యూరియా రూపంలో రైతన్నపై అధిక భారం పడుతుందని గగ్గోలు పెడుతున్నారు.

అయితే, కొంతమంది హోల్‌సేల్ వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతుల నుంచి అధికంగా డబ్బులు దండుకుంటున్నారు. ఎంత రవాణా చార్జీలు కలుపుకున్న ఒక యూరియా బస్తా రైతుకు రూ.280 మించి పడే పరిస్థితి లేదు. కానీ రిటైల్ వ్యాపారులు.. హోల్ సెల్ వ్యాపారులకు సహకరిస్తూ ఒక్కో బసకు రూ.350కి పైగా వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే ఇష్టముంటే తీసుకోండి.. లేకపోతే లేదంటూ సమాధానం ఇస్తున్నారు. అసలే అదును దాటిపోతుండడం.. నారు ముదురుతుండడం వల్ల రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో యూరియా బస్తాలను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

మిర్యాలగూడ కేంద్రంగా దందా..

నల్గొండ జిల్లాలో యూరియా స్టాక్ పాయింట్‌గా ఉన్న మిర్యాలగూడ నుంచి ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోల్‌సేల్ వ్యాపారులు తమకు అనుకూలంగా ఉన్న రిటైల్ వ్యాపారులకు మాత్రమే సరుకు రవాణా చేస్తూ.. అధిక ధరలకు విక్రయాలు సాగిస్తూ రైతుల వెన్నువిరుస్తున్నారు. యూరియా ఒక బస్తా ఉత్పత్తికి వెయ్యికి పైగా ఖర్చు అవుతుండగా ప్రభుత్వం సబ్సిడీ భరిస్తూ 45 కిలోల యూరియా బస్తాను 266.50 రూపాయలకు రైతులకు అందిస్తుంది. రైతుల సబ్సిడీని ప్రభుత్వం నేరుగా కంపెనీలకు చెల్లిస్తుంది.

సాగర్ ఆయకట్టులో డిమాండ్ అధికం..

నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో మొదటి జోన్‌లో మూడు లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేస్తుండగా.. యూరియాకు ఇక్కడ అధికంగా డిమాండ్ ఉంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో యూరియా అవసరం ఎక్కువగా ఉండగా యాదాద్రి జిల్లాలో తక్కువ వినియోగం ఉంది. అధికారులు మూడు జిల్లాలకు సమానంగా కేటాయిస్తుండగా ఆయకట్టు ప్రాంత రైతులకు యూరియా కొరత ఏర్పడుతుంది.

ఏ ప్రాంతానికి చెందిన ఎరువుల కంపెనీల వారైనా మిర్యాలగూడకు రైల్వే వ్యాగన్లతో తీసుకువస్తున్నారు. వచ్చిన సరకులు 50% సొసైటీలకు మిగతాది వ్యాపారులకు అందిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న కొన్ని దుకాణాలకే యూరియాను బ్లాక్ ధరలకు పంపుతుండగా రైతులకు 266 రూపాయలకు ఇవ్వాల్సిన యూరియా బస్తా.. రూ.360 ధరకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులపై అదనపు భారం పడుతుంది.

యూరియాకు ఇతర ఎరువుల లింక్..

మరి కొందరు వ్యాపారస్తులు తమ వద్దనున్న ఇతర కాంప్లెక్స్ చెరువులు, జింక్ వంటివి కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామంటూ ఆంక్షలు పెడుతుండగా పెద్ద రైతులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిర్యాలగూడ ఏరియాలో బోర్లు, బావుల కింద ముందుగా వేసిన పంటకు యూరియా అవసరం వస్తుండగా ఇప్పుడే వ్యాపారస్తులు కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

ఎకరాకు రైతులు రెండు నుంచి మూడు బస్తాల యూరియా చల్లుతుంటారు. అదే సాగర్ ఆయకట్టు (ఎడమ కాలువ) కింద వేసిన లక్షల ఎకరాల వరి పొలానికి యూరియా అవసరమైనప్పుడు రైతులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు గోదాములను, రిటైల్ షాపులను తనిఖీలు చేసి ప్రభుత్వం ధరలకే యూరియా విక్రయించే విధంగా చూడాలని, యూరియాను బ్లాక్ చేసే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


Next Story

Most Viewed