విద్యపై నిరంతరం మేధోమదనం

by  |
విద్యపై నిరంతరం మేధోమదనం
X

దిశ, న్యూస్​బ్యూరో: సమాజ అవసరాలను బట్టి సిలబస్, అందుకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ తోరట్, ఢిల్లీ నైపా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్.వీ వర్గీస్ అభిప్రాయపడ్డారు. గురువారం ‘విద్యా విధానం, ప్రణాళికా, పారదర్శకత’ అనే అంశంపై జరిగిన వెబినార్‌లో ప్రణాళిక సంఘం వైస్​ ఛైర్మన్​ వినోద్ కుమార్ పలు అంశాలను వారితో పంచుకున్నారు. మెరుగైన విద్యను విద్యార్థులకు అందించేందుకు నిరంతరం విద్యపై మేధోమదనం జరగాల్సిన అవసరం ఉందని వారు వినోద్ కుమార్​తో అన్నారు. టీచింగ్, లెర్నింగ్, పరీక్షల విధానంలో మార్పులు రావాలని, ఎప్పటికప్పుడు విద్యా విధానంపై డిబేట్స్ జరగాలని తోరట్, వర్గీస్‌లతో కలిసి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాల, బాలికలకు రెసిడెన్షియల్ స్కూళ్లను పెద్ద ఎత్తున ప్రారంభించినట్లు తోరట్, వర్గీస్​లకు వినోద్ కుమార్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మొదటి తరం ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారిని ఉన్నత విద్యలో ఇతరులతో పోటీ ప్రపంచంలో ముందుకు సాగేందుకు అవకాశాలు ఉండాలని వక్తలు పేర్కొన్నారు. సెస్, ఉన్నత విద్యామండలి మధ్య అవగాహన ఒప్పందంతో సాక్ష్యాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. ఈ వెబినార్​లో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ లింబాద్రి, వెంకట రమణ, సెస్ చైర్మన్ రాధాకృష్ణ, డైరెక్టర్ రేవతి తదితరులు పాల్గొన్నారు.



Next Story