ఎంజీఎంలో భోజనం కూడా దొరకని పరిస్థితి

by  |
ఎంజీఎంలో భోజనం కూడా దొరకని పరిస్థితి
X

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ వచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించక పోవడం సిగ్గుచేటని, ఆస్పత్రిలోని వైఫల్యాలు బయట పడుతాయనే ఫంక్షన్ హాల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారని వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. హన్మకొండలోని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కైన ఎంజీఎంను కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని, దీంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు.

రోజుకు 100 పాజిటివ్ కేసులు నమోదవుతున్నందునా వేగంగా చర్యలు చేపట్టాలన్నారు. మెరుగైన వైద్య సేవలు అందాలంటే సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలన్నారు. ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్, వెంటిలేటర్ల కొరత ఉన్నందున తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సరైన పరికరాలు, వసతులు లేకపాయినప్పటికీ కుటుంబాలను వదిలి, ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న డాక్టర్లపై అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు, పీఏల రోగుల బంధువుల పేరిట దాడులు జరుగుతున్నా.. వారికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

ఎంజీఎంలోని కోవిడ్ వార్డులో రోగులకు భోజనం కూడా సరిగ్గా దొరకని పరిస్థితి‌ ఉందన్నారు. కరోనాను కట్టడిలో తెలంగాణా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కోవిడ్ – 19 నివారణలో నిర్లక్ష్యం వీడాలన్నారు. వారంలోగా చర్యలు తీసుకోవాలని లేదంటే ఎమ్మెల్యే, ఎంపీల ఇండ్ల‌ ఎదుట ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.


Next Story