పల్లెల్లో పని వెతుకులాట..

by  |
పల్లెల్లో పని వెతుకులాట..
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ :

‘పెద్దయ్య ఎలా వున్నావు…?, ఎవరురా నువ్వు? నేను గుర్తుపట్టలేదు…, నేను రంగయ్య కొడుకుని పెద్దయ్య…, ఓరీ నువ్వా ఎప్పుడో పదేండ్ల కింద చూసానురా.. అందుకే గుర్తు పట్టలే… పట్నంలో ఉంటున్నవ్ కదా.. ఏం పని చేస్తున్నావ్ అక్కడ? పట్నం నుంచి వచ్చేశాను పెద్దయ్య.. అక్కడ పరిస్థితులు మంచిగలేవు.. అందుకే అన్నీ సదురుకుని ఇక్కడికి వచ్చేశాను.. మన ఊర్లనే ఉంటూ పొలం పనులు చేస్తుకుందామనుకుంటున్న.. ప్రస్తుతం గ్రామాల్లో ఇలాంటి పలకరింపులు పెరిగాయి. ఎపుడో ఏండ్ల క్రితం గ్రామాలను వదిలి వెళ్లిన వారు సైతం నేడు సొంత గ్రామాలకు వచ్చారు. స్థానంగానే ఏదో పనిచేసుకుందామని కొందరు ఆలోచిస్తుంటే, ఎక్కువ మంది వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు.

మొన్నటి దాక బోసిపోయిన పల్లెలు నేడు కళకళలాడుతున్నాయి. స్వగ్రామంలో ఏమి లేదని చెపుకుంటూ పట్నం బాట పట్టిన వారంతా ప్రస్తుతం పల్లెలకు దాదాపుగా వచ్చేశారు. కరోనా దెబ్బకు పట్నంలో చేసేందుకు పనులు లేక చాలా మంది వలసదారులు, యువకులు స్వగ్రామాలకు చేరుకున్నారు. దీంతో పల్లెలు కళను సంతరించుకున్నాయి.

ఏండ్ల తరబడి సొంత గ్రామాలను విడిచి ఎక్కడో పొట్టచేతపట్టుకుని జీవనం సాగిస్తున్న అనేక మంది.. ప్రస్తుతం అక్కడ ఉపాధి అవకాశాలు లేక సొంత గ్రామాలకు వచ్చి దొరికిన పనులు చేసుకుంటున్నారు. ఏండ్ల తరబడి బీడు భూములుగా మారిన వేలాది ఎకరాలు నేడు సాగుకునోచుకుంటున్నాయి. ప్రస్తుతం వర్షాలు సైతం కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా సాగు సైతం బాగా పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతేడాది వానాకాలంలో 7 లక్షల ఎకరాలు సాగు కాగా, ఇప్పుడు మరో 3లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తున్నదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

పెరుగుతున్న బంధాలు..

ఏండ్ల తరబడి కన్నవారిని, అయిన వారికి దూరంగా పనిచేసిన వారు స్వగ్రామాలకు చేరుకోవడంతో పాత జ్ఞపకాలను నెమరువేసుకుంటున్నారు. చాలా మంది తమ చిన్ననాటి స్నేహితులతో పాటు పాత బంధువులను కలవడంతో వారి మద్య బంధాలు మరింత పదిలమవుతున్నాయి. ముఖ్యంగా నిత్యం పుస్తకాలతో కుస్తీ… కాలుష్య కోరలు… యంత్రాలు…. వాహనాల మొతలు…. టీవీలు చూడటంతో కాలక్షేపం చేసే చిన్నారులకు నేడు కొత్త అనుభూతులను పొందుతున్నారు. ఉదయం నుంచి ఇంట్లో ఉంటూ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతాయ్యలు, బాబాయ్‌లు, మామ్మయ్య, అత్తల పలకరింపులతో వారిలో నూతన ప్రపంచంలోకి తీసుకువచ్చినట్టయింది. ఎంతసేపు టీవీల ముందు కాలక్షేపం చేసే చిన్నారులు.. నేడు తాతయ్యలు చెప్పే కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు.

అక్కడ చేసే పనే ఇక్కడ..

ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణాల్లో పనులు లేకపోవడంతో గ్రామాలకు చేరుకున్న చాలా మంది అక్కడ చేస్తున్న పనులే ఇక్కడ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అక్కడ నడిపే వాహనాలే ఇక్కడ నడుపుతూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. మరికొంత మంది ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. జిల్లాలో చాలా మట్టుకు యువత వ్యవసాయ పనులలో నిమగ్నమైంది. కొంత మంది తమ స్వంత వ్యవసాయ పొలంలోనే వివిధ రకాల పంటలను సాగు చేసేందుకు సిద్దమయ్యారు.

భయం.. భయం..

గ్రామాల నుంచి పట్టణాలకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. చివరకు శుభకార్యాలకు సైతం వెళ్లాలన్నా వెనకడుగు వేస్తున్నారు.


Next Story

Most Viewed