కార్పొరేటు ఆసుపత్రుల దోపిడీపై విజిలెన్స్ దర్యాప్తు

by  |
కార్పొరేటు ఆసుపత్రుల దోపిడీపై విజిలెన్స్ దర్యాప్తు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని సొమ్ము చేసుకోడానికి ప్రయత్నించి రోగుల నుంచి బలవంతంగా లక్షలాది రూపాయలు వసూలుచేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులపై ఎంక్వయిరీ కమిటీలతో దర్యాప్తు చేయించి నివేదికలో పేర్కొన్న వివరాల ఆధారంగా వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే ఆయా ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేసేంత కఠిన నిర్ణయాన్ని కూడా తీసుకోనుంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం విధాన ప్రకటన విడుదల చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వైద్యారోగ్య శాఖలోని ఉన్నతాధికారులతో విజిలెన్స్ కమిటీ ఏర్పాటవుతుందని తెలిపారు. కరోనా చికిత్స అందిస్తున్న రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులపై ఈ దర్యాప్తు ఉంటుందని, తొలుత ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు.

సచివాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు పది రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స అవసరం లేని కేసులను కూడా ఉద్దేశపూర్వకంగా సీరియస్ కండిషన్ అని చెప్తూ అడ్మిట్ చేసుకుని లక్షలాదిరూపాయల బిల్లు వేస్తున్నట్లు మంత్రికి వివరించారు. అడ్మిట్ చేసుకునే సమయంలోనే కనీసంగా నాలుగైదు లక్షల రూపాయలు అడ్వాన్సుగా తీసుకుంటున్నట్లు ఫిర్యాదుల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. రోజుకు సగటున లక్ష రూపాయలకంటే ఎక్కువే బిల్లు వేస్తున్నాయని, పేషెంట్ కండిషన్ సీరియస్ అయిన తర్వాత అంబులెన్సులో ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారని వివరించారు. బెడ్‌లు లేవంటూ కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయని మంత్రికి వివరించారు.

వీటన్నింటిని సీరియస్‌గా తీసుకున్న మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులతో విజిలెన్స్ కమిటీని ఏర్పాటుచేసి ఫిర్యాదులపై విచారణ జరపాలని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నివేదిక అనంతరం ఆయా ఆసుపత్రులపై ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటుందని, అవసరమైతే లైసెన్సు రద్దు చేయాల్సి వస్తుందని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడడంతో కార్పొరేట్ ఆసుపత్రులు మానవతా దృక్పథంతో, సామాజిక బాధ్యతతో మెలగాలని సూచిస్తూనే ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని లాభార్జన కోసం వాడుకోవడం తగదని హెచ్చరించారు. సాధారణ ఛార్జీలకు పది రెట్లు ఎక్కువగా రకరకాల పేర్లతో వసూలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇక నుంచి ప్రతీ ఆసుపత్రి ఎన్ని బెడ్‌లు ఖాళీగా ఉన్నాయో ప్రజలకు తెలిసేలా డిస్‌ప్లే బోర్డు పెట్టడంతో పాటు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను పాటించకపోతే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పీపీఈ కిట్లు, ఐసీయూ ఛార్జీలు, సిబ్బందికి అధిక జీతాలు, డాక్టర్ల కన్సల్టేషన్ ఫీజులు.. ఇలా అడ్డగోలుగా ప్రజలమీద భారం మోపడం తగదని, లాభాల కోసం మానవతా దృక్ఫథాన్నే వదులుకోవడం సహేతుకం కాదన్నారు.

జిల్లాల్లోనే కరోనా చికిత్సలు… అత్యవసరమైతేనే హైదరాబాద్‌కు

కరోనా పాజిటివ్ పేషెంట్లకు అవసరమైన వైద్య చికిత్సలను ఎక్కడికక్కడ జిల్లా ఆసుపత్రుల్లోనే నిర్వహించాలని, అత్యవసరమైన కేసులైతే మాత్రమే హైదరాబాద్‌కు పంపాలని అన్ని జిల్లాల వైద్యాధికారులకు మంత్రి సూచించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రితో పాటు మరికొన్ని ఆసుపత్రులకు కూడా కరోనా పాజిటివ్ పేషెంట్లను పంపాలని, జిల్లాల్లో కూడా టెరిటరీ కేర్ ఆసుపత్రుల్లో ఈ సేవలను అందించాలని అధికారులకు సూచించారు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఎలాగూ ఆక్సిజన్ సౌకర్యం ఉన్నందున అక్కడే చికిత్స ఇవ్వడానికి డాక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి లక్షణాలు లేని పాజిటివ్ పేషెంట్లను వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాల్సిందిగా ప్రోత్సహించాలని సూచించారు.


Next Story