సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి

by  |
సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు మంగ‌ళ‌వారం రాత్రి 7.00గంట‌లకు క‌ల్యాణ మండ‌పంలో మలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై బ‌కాసుర వ‌ధ‌ అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో మలయప్పస్వామివారు క‌ల్ప‌వృక్ష‌‌ వాహనంపై త‌ల‌పాగా, జాటీతో గోవుల గోప‌న్న‌గా భక్తులను ఆకట్టుకున్నారు. మధ్యాహ్నం శ్రీ‌వారి ఆల‌యంలో మొద‌టి సారిగా కివిఫ్రూట్‌, నెమ‌లి ఈక‌లతో ప్ర‌త్యేకంగా రూపొందించిన మాల‌లు, కిరీటాల‌తో స్న‌ప‌న‌తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా జ‌రిగింది.

సర్వభూపాల వాహ‌నం- య‌శోప్రాప్తి

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

కార్యక్రమంలో మంత్రి గౌత‌మ్‌రెడ్డి, టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, డాక్టర్ నిశ్చిత‌, శేఖ‌ర్‌రెడ్డి, గోవింద‌హ‌రి, డీపీ అనంత‌, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.


Next Story