ఆలస్యం చేస్తే పార్టీకి నష్టం: వంశీచంద్‌రెడ్డి

by  |
ఆలస్యం చేస్తే పార్టీకి నష్టం: వంశీచంద్‌రెడ్డి
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవానికి రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి సూచించారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఏడాది కాలపరిమితి పూర్తవుతున్న సందర్భంగా ఆమెతో పాటు 21మంది సభ్యులు, 15మంది శాశ్వత ఆహ్వానితులు, 11మంది ప్రత్యేక ఆహ్వానితులకు ఆదివారం వంశీచంద్‌రెడ్డి లేఖ రాశారు. దేశంలోని కోట్లాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మద్ధతుదారుల తరపున లేఖ రాస్తున్నానని, రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడం అనివార్యమని, ఈ నిర్ణయం కోసమే కాంగ్రెస్ శ్రేణులు వేచిచూస్తున్నారని తెలిపారు. రేపు ఉదయం 11గంటలకు జరిగే సీడబ్ల్యూసీ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్‌కు బాధ్యతలు అప్పగించాలని కోరారు.

పార్టీలోని వివిధ వర్గాలు, పాత, కొత్తతరం నాయకులని సంఘటితం చేసి, పార్టీ అభ్యున్నతి కోసం శక్తి సామర్ధ్యాలను క్రోడీకరించగలిగే నాయకుడు కేవలం రాహుల్ గాంధీ ఒక్కరే అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి అత్యంత ఆవశ్యకం అని, ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేసినా పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని లేఖలో వివరించారు.


Next Story