ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంశం కాదు: సోనియా

by  |
ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంశం కాదు: సోనియా
X

న్యూఢిల్లీ: ఉపాధి హామీ చట్టాన్ని పేదల లబ్ధి కోసం తప్పకుండా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం దేశం సంక్షోభ కాలాన్ని ఎదుర్కొంటున్నదని, రాజకీయాలకు ఇది సమయం కాదని తెలిపారు. కాబట్టి ఉపాధి హామీ చట్టంతో పేదలను ఆదుకోవాలని వివరించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సోనియా గాంధీ రాసిన ఓ వ్యాసంలో ఈ విషయాలను పేర్కొన్నారు. సమాజంలో ఒక పద్ధతి ప్రకారం విప్లవాత్మక మార్పులను ఈ చట్టం తీసుకొచ్చిందని తెలిపారు. ఎలాగంటే ఈ చట్టం నేరుగా పేదలను ఆదుకుంటుందని, ఆకలి, దారిద్ర్యం నుంచి బీదలను ఈ చట్టం బయటవేస్తుందని వివరించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అవసరార్థులకు నేరుగా పని కల్పించిందని, చట్టాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థతో అనుసంధానం చేయగా ధాన్యం పేదల ఇండ్లకు చేరిందని తెలిపారు. ఇలా పేదరికం, కరువుకాలాన్ని ప్రజలు విజయవంతంగా ఎదుర్కోగలిగారని వివరించారు. అయితే, బీజేపీ ప్రభుత్వం తొలి నుంచీ ఈ చట్టాన్ని నీరుగార్చేందుకు పూనుకున్నదని, ఎన్నోరకాలుగా చట్టాన్ని తొలగించాలని ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను అనుసంధానం చేసి దాని రూపాన్ని మార్చాలని ప్రయత్నించారని, అయినా ఆ చట్టం తన స్వరూపాన్ని కోల్పోలేదని తెలిపారు. ప్రజల నుంచి దానికున్న డిమాండ్, కార్యకర్తల ఆందోళనలు ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేశాయని వివరించారు. ఇప్పటికీ ఈ చట్టం అమలవుతోందని, మే నెలలోనైతే ఎనిమిదేళ్లలో గరిష్టంగా ఈ చట్టం కింద పని కోసం డిమాండ్లు వచ్చాయని వివరించారు. అదే ఆ చట్టం గొప్పతనమని అభిప్రాయపడ్డారు. సింపుల్‌గా చెప్పాలంటే అన్నార్తులను ఈ చట్టం నేరుగా ఆదుకుంటుందని, వారికి పని కల్పించి డబ్బు అందిస్తుందని తెలిపారు. ఈ కరోనా ఆపత్కాలంలో అనేకులు ఉపాధి కోల్పోయారని, వారంతా గ్రామాల బాట పట్టారని పేర్కొన్నారు. వారందరికీ ఈ చట్టం ద్వారా ఉపాధి కల్పించి ఆకలి, పేదరికం నుంచి రక్షించవచ్చునని సూచించారు. ఈ జాతీయ విపత్తు కాలంలో ప్రభుత్వం పంతాలను పక్కనపెట్టి పేదలకు ఉపయోగపడే ఉపాధి హామీ చట్టాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంశం కాదని, ప్రభుత్వానికి బలమైన వ్యవస్థ ఉన్నది, ఈ చట్టంతో పేదలనే ఆదుకోవచ్చునని వివరించారు.


Next Story

Most Viewed