అమెరికా కంపెనీలు ఇండియాకు..వయా చైనా!

by  |
అమెరికా కంపెనీలు ఇండియాకు..వయా చైనా!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వల్ల అంతర్జాతీయ వ్యాపార విధానాలే మారిపోనున్నాయా? అంతర్జాతీయ కంపెనీలన్నీ తమ వ్యాపారాలకు అనువైన కొత్త మార్గాల కోసం అన్వేషిస్తున్నాయా? అంటే పరిణామాలు అవుననే అంటున్నాయి. కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో చైనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం తప్పదనే చర్చ మొదలైంది. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే..నిజమేననే అభిప్రాయం వినిపిస్తోంది. చైనాలో ఉన్న తమ పెట్టుబడులకు మరో ప్రదేశాన్ని వెతికే పనిలో ఉన్నట్టు అమెరికా కంపెనీలు చెబుతున్నాయి. చైనా తర్వాత ఇండియానే ప్రత్యామ్నాయమని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి అమెరికా విదేశాంగ శాఖ మద్దతు కూడా బలాన్నిస్తోంది. గడిచిన కొన్నేళ్లుగా చైనా కేంద్రంగా కొనసాగుతున్న కార్యకలాపాలను ఇండియాకు తరలిస్తే వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుందని అమెరికా బహుళజాతి కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి.

ట్రంప్ సర్కారు మద్దతు…

ఇటీవల అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, ఇండియాలో ఉన్న దిగ్గజ అమెరికా కంపెనీల ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రధాన చర్చగా సాగినట్టు తెలుస్తోంది. ఇండియా ప్రాధాన్యత గురించి, చైనా నుంచి ఇండియాకు సంస్థల కార్యకలాపాల తరలింపు విషయమై సభ్యులు చర్చించారు. చైనా కేంద్రంగా ఉన్నటువంటి పారిశ్రామిక కార్యకలాపాలను ఇండియాకు తరలించే అవకాశాలున్నాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ దక్షిణాసియా వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ థామస్ పేర్కొన్నారు. ఇదే సమావేశంలో కంపెనీలు ఇండియాకు రావాలంటే భారత ప్రభుత్వం ఆయా కంపెనీలకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వమని కోరడానికి సిద్ధంగా ఉన్నట్టు కంపనీలు నిర్ణయించాయి. దీనికి మిగిలిన కంపెనీలు సైతం మద్దతు ఇచ్చాయి.

ఇప్పటికే కరోనా వల్ల ఆర్థికంగా అత్యధిక నష్టాలను ఎదుర్కొన్న అనేక కంపెనీలు దక్షిణ కొరియా వంటి ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుని వెళ్లాయి. అయితే, మానవనరులతో పాటు ఇంకా అనేక రూపాల్లో చైనాతో సారుప్యత కలిగిన ఇండియాకు కంపెనీలను తరలించేందుకు ఎక్కువ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూపకూలింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా కాకుండా మరో దేశం సానుకూలంగా ఉండకపోవచ్చని, దీనికి అమెరికా ట్రంప్ సర్కారు కూడా మద్దతు ఉందని కొందరు అధికారులు భావిస్తున్నారు.

తగిన ప్రోత్సాహకాలు ఇస్తే…

ఇదే సమావేశంలో పాల్గొన్న అమెరికా విదేశాంగ శాఖలో ఉన్న దక్షిణాసియా దేశాల అసిస్టెంట్ కార్యదర్శి థాంస్ ‘చైనాలోని పారిశ్రామిక కార్యకలాపాలకు ఇండియా తొందరగా అనూకుల్లంగా మారుతుందని, ఇండియాకు ఇదొక మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. పైగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు కూడా కంపెనీల తరలింపుకు సహాయకారిగా ఉంటాయన్నారు. చైనాను వదిలి వెళ్లే సంస్థలతో పాటు, విదేశాలన్ ఉంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇండియాకు అనువైన సమయమని, దానికి తగినట్టు భారత ప్రభుత్వం వ్యూహాలను రూపొందించగలిగితే చాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, వేగవంతమైన అనుమతులు, ప్రోత్సాహకాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. కరోనా నష్టాలను భర్తీ చేస్తూ అవకాశాలను అందుకోవాలని ప్రయత్నించే అమెరికా కంపెనీల విస్తరణకు తగినట్టుగా ఇండియా అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని సంస్థలు కోరుతున్నాయి. కంపెనీలకు తగిన సానుకూల వాతావరణం కల్పిస్తే అనేక సంస్థలు ఇండియాకు తరలే ఛాన్స్ ఉందని కంపెనీలు చెబుతున్నాయి. సమావేశంలో అందరూ వెల్లడించిన అభిప్రాయలను మోదీ ప్రభుత్వానికి తెలియజేయాలంటూ ట్రంప్ సర్కార్‌ను కోరనున్నట్టు తెలుస్తోంది.

దేశంలో ముఖ్యంగా భవిష్యత్తుకు ఉపయోగపడే రంగం ఎలక్ట్రానిక్స్ తయారీని వీలైనంత ప్రోత్సాహించాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. కరోనా వల్ల చైనాకు కలిగే నష్టం ఇండియా కలిసొస్తుందని, ఇండియా దీన్ని అందిపుచ్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా-చైనా ఒప్పందం బలహీనమవుతున్న వేళ..

వీటికి తోడు శుక్రవారం చైనా వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చైనాతో తమ వాణిజ్య ఒప్పందాలు ద్వితీయ శ్రేణి ప్రాముఖ్యత అని స్పష్టం చేశారు. కొవిడ్-19 వల్ల చైనాపై వాణిజ్య సుంకాలను పెంచుతామని ఆయన హెచ్చరించారు. అయితే, కొవిడ్-19 మనుషుల సృష్టి కాదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేసిన గంటల వ్యవధిలోనే ట్రంప్ వాణిజ్యానికి సంబంధించి ఈ స్థాయిలో వ్యాఖ్యానించడం ఆశ్చర్యపరిచే విషయం. ఇదే సందర్భంలో ఇరు దేశాల మధ్య ఇటీవల జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని తేలిగ్గా ప్రస్తావిస్తూ..సుంకాలను పెంచే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా-చైనా మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ జనవరిలో సంతకం చేశారు. చైనా ఎగుమతి చేసే కొన్ని వస్తువలపై సుంకాలను తగ్గించాలనేది ఈ ఒప్పందం లక్ష్యం. కరోనా వైరస్ విజృంభనతో ఒక్కసారిగా ఈ ఒప్పందం బలహీనమయ్యే పరిస్థితి ఉంది. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో అమెరికాకు చెందిన కంపెనీలు చైనాను వదిలి అనుకూలంగా ఉన్న ఇండియాకు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

Tags : China, Coronavirus, India, US, US State Department, companies choosing India


Next Story