హరీశ్‌రావు ఇల్లు ముట్టిడిస్తాం

by  |
హరీశ్‌రావు ఇల్లు ముట్టిడిస్తాం
X

దిశ, సిద్దిపేట: కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు బ్యాగరి నర్సిములు ఆత్మహత్యకు బాధ్యులైన నిందితులు సర్పంచ్, తహసీల్దారు, విఅర్వోలను అరెస్టు చేసేవరకు దళిత సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ అధ్వర్యంలో ఐక్య ఉద్యమం చేయనున్నట్లు దళిత సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ప్రకటించింది.

శుక్రవారం సిద్దిపేటలో ఈ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత రైతు నర్సిములు కుటుంబానికి ఉన్న13 గుంటల భూమిలో ప్రభుత్వం బలవంతంగా రైతు వేదిక భవన నిర్మాణానికి గుంజుకొవడంతో ఎలా బతకాలని వాయిస్ రికార్డు చేసి విషం తాగి మరణించడం బాదకారమన్నారు. ఈ విషయమై కేసు పెట్టినప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదన్నారు.

వీఆర్వో, తహసీల్దార్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, భాధిత కుంటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే జిల్లా కలెక్టర్, గజ్వేల్ ఆర్డీవో కార్యాలయాల ముందు ధర్నా చేసి, పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రానందున ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన, 16 న జిల్లాలోని మండల కేంద్రాలలో అంబేద్కర్ విగ్రహాల ముందు ధర్నాలు, 17న ప్రజ్ఞాపూర్ లో రాజీవ్ రహదారి దిగ్బంధం, 20న మంత్రి హరిష్ రావు ఇల్లు ముట్టడిస్తామని తెలిపారు.

ఈ ఉద్యమంలో దళిత, గిరిజన, రైతు సంఘాలు,ప్రజాస్వామిక వాదులు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ పి.శంకర్, భీమ్ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అర్.భీమసేనా, మాలమహనాడు రాష్ట్ర సెక్రటరీ జనరల్ కరికె శ్రీనివాస్‌, యంఈఎఫ్ జిల్లా ఇన్ చార్జి ముండ్రాతి క్రిష్ణ, సామాజిక హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి కొడకండ్ల నర్సిములు, వివిధ సంఘాల నాయకులు ర్యాకం శ్రీరాములు, ఎలుక దేవయ్య, వెన్న రాజు, రాచురి మల్లికార్జున్, క్రాంతి అంబేద్కర్, అర్.రాజు పాల్గొన్నారు.



Next Story