కరోనా టైమ్.. కటౌట్‌ల సమక్షంలో పెళ్లి!

by  |
కరోనా టైమ్.. కటౌట్‌ల సమక్షంలో పెళ్లి!
X

దిశ, వెబ్‌డెస్క్:

కరోనా కాలంలో పెళ్లిళ్ల విధానమే మారిపోయింది. ఎంతో అంగరంగవైభవంగా జరుపుకునే ఈ వేడుకను సింపుల్‌గా బర్త్‌డే పార్టీ చేసుకున్నట్లు చేసుకోవాల్సి వస్తోంది. అంటే.. జనాలంటే పెద్దగా ఇష్టపడని వారు లోలోపల హ్యాపీగానే ఉన్నారనుకోండి, కానీ అసలు సమస్య మొత్తం పెళ్లి గురించి పెద్ద పెద్ద కలలు కన్న వారితోనే. తమ పెళ్లి ఇలా జరగాలి, అలా జరగాలి, ఇంత మంది రావాలి, ఇంత మందికి వడ్డించాలి అని లెక్కలేసుకునేవారు కొందరు ఉంటారులెండి. అలాంటి వాళ్లకు ఈ కరోనా వచ్చి చెక్‌మేట్ పెట్టేసింది. లాక్‌డౌన్ తర్వాత సడలింపులు ఇస్తున్నా కొందరిని మాత్రమే ఆహ్వానించాలని రూల్ పెట్టడంతో వీళ్లు నిరుత్సాహపడుతున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన రొమానీ, సామ్ రొండే-స్మిత్‌ల జంట కూడా ఆ కోవకు చెందినవారే. తమ పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ కరోనా ఆ కలలకు బ్రేక్ వేసింది. కానీ వాళ్లు ఆగలేదు. వారి పెళ్లిని ఇంకా స్పెషల్‌గా అందరికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా జరుపుకున్నారు. ఎలాగంటారా?

తమ పెళ్లిని తామిద్దరు మాత్రమే కాకుండా అందరి సమక్షంలో జరుపుకోవాలని రొమానీ, సామ్ అనుకున్నారు. జులైలో పెట్టుకున్న ముహుర్తం కొవిడ్ కారణంగా వాయిదా పడింది. చివరి ఆగస్టు 14న డేట్ ఫిక్స్ అయింది. కానీ యునైటెడ్ కింగ్‌డమ్‌లో పెళ్లిళ్లకు 14 మంది అతిథులకు మాత్రమే అనుమతి ఉంది. దగ్గరివాళ్లందరికీ కాల్ చేశారు. వారిలో ఒక స్నేహితురాలు ‘నేను రాలేను కానీ, నా ఫొటో పంపిస్తా.. కటౌట్ చేయించుకుని పెట్టుకో’ అంటూ వేసిన జోక్‌తో రొమానీకి ఒక ఐడియా వచ్చింది. ఆమెది మాత్రమే కాదు, వారి పెళ్లిలో తప్పనిసరిగా ఉండాల్సిన 48 మంది జాబితాను ఆ జంట సిద్ధం చేశారు. వాళ్లందరికీ కాల్ చేసి, ఫొటోలు పంపించాలని కోరారు. వాళ్లు పంపిన ఫొటోలను పెద్ద పెద్ద కటౌట్లుగా కొట్టించి, అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ కటౌట్ల కోసం వాళ్లు దాదాపు రూ. 2 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఐడియా బాగుంది కదా!


Next Story