ఫుడ్‌పార్క్ కల తీరదు.. రైతుల రాత మారదు!

by  |
ఫుడ్‌పార్క్ కల తీరదు.. రైతుల రాత మారదు!
X

దిశ, వెబ్ డెస్క్: పచ్చని పోలాలను ఫుడ్ పార్క్ పేరిట నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. అక్కడ పార్కు ఏర్పాటైతే రైతులు పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉంటుందని, గిట్టుబాటు వస్తుందని నమ్మించింది. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బుగ్గపాడు సమీపంలోని పంట పొలాల్లో ఫుడ్‌పార్క్ కోసం విశాలమైన రోడ్లు, మధ్యలో డివైడర్లు, రోడ్లకిరువైపులా వీధి దీపాలు ఏర్పాటు చేశారు. దానిని చూస్తుంటే ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లా కనిపిస్తుంది.

పాడి పంటలతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతంలో ఫుడ్‌పార్క్ పేరిట 2008లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చేసింది. ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసేసి నిర్మాణ పనులను అటకెక్కించింది. దీంతో భూములు ఇచ్చిన రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. వ్యవసాయం చేసుకోలేక ఫుడ్ పార్క్ ప్రారంభం కాక, పచ్చని పంటలతో ఉండే భూములు బీడుగా మారడాన్ని చూసి అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక కొలువుదీరిన ప్రభుత్వంతో ఫుడ్‌పార్క్ నిర్మాణానికి మళ్లీ రెక్కలొచ్చాయి.

రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. రైతులు పండించిన ఉత్పత్తులను నేరుగా ఫుడ్ పార్క్‌కు తీసుకురావచ్చనే భరోసా కల్పించారు. వినియోగదారులు కూడా ఇక్కడ తాజా వస్తువులను కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. రైతులు వ్యాపారులకు అనుసంధానంగా ఫుడ్ పార్క్ ఉంటుందని అన్నదాత కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని హామీ ఇచ్చారు.

భూసేకరణ చేసి సుమారు 14 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పనులు మాత్రం పూర్తి కాలేదు. ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనులు చూస్తుంటే మొదట విశాలమైన రోడ్లు వేశారు. మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేస వీధి దీపాలు అమర్చారు. దూరం నుంచి చూస్తే ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌ను తలదన్నేలా రహదారులను నిర్మించారు. సేకరించిన భూమిలో నిర్మాణాలు ప్రారంభించారు. ఒక పరిపాలనా భవనంతో పాటు పలు షెడ్లు కూడా నిర్మించారు.కానీ, అంతకుమించి ఫుడ్ పార్కు నిర్మాణంకోసం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా లైట్ తీసుకోవడంతో మా పరిస్థితి ఎంటనీ రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


Next Story