విద్యార్థులూ.. పేదలకు సేవలందించండి : గవర్నర్

by  |
విద్యార్థులూ.. పేదలకు సేవలందించండి : గవర్నర్
X

దిశ, న్యూస్‌బ్యూరో : ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో యూనివర్సిటీల్లోని ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ప్రోగ్రామర్లు సమాజంలోని పేదలకు, అవసరార్థులకు సేవ చేయాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కరోనాకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆమె రాష్ట్రంలోని యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూనివర్సిటీలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్లాసుల విషయమై ఈ కాన్ఫరెన్స్‌లో రిజిస్ట్రార్‌లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 70 శాతం మంది విద్యార్థులు తాము నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నారని, మిగతా వాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటంతో సరైన కనెక్టివిటీ లేక క్లాసులు మిస్సవుతున్నారని యూనివర్సిటీల రిజిస్ట్రార్లు గవర్నర్‌కు వివరించారు. పీజీ విద్యార్థులకు 80 శాతం, డిగ్రీ విద్యార్థులకు 70శాతం సిలబస్ పూర్తయిందని తెలిపారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తుండటంపై యూనివర్సిటీల రిజిస్ట్రార్లను గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు.

Tags: telangana governor, university registrar, video conference, online classes


Next Story

Most Viewed