పద్ధతిగా ప్రయాణం..

by  |
పద్ధతిగా ప్రయాణం..
X

దిశ, వెబ్‌డెస్క్: అన్‌లాక్ 4.0లో భాగంగా మెట్రో రైళ్లు నడపడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్ట్రిక్ సర్వీసు బస్సులు కూడా నడుస్తున్నాయి. అలాగని వైరస్ అంతరించిపోయినట్లు కాదు. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రయాణాలు లేకపోతే ఆర్థిక వ్యవస్థకు నష్టం కాబట్టి ప్రజారవాణా సేవలను నిబంధనలకు అనుగుణంగా ప్రారంభిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు విధించినా మనకంటూ కొంత సన్నద్ధత ఉండాలి. ఒకప్పటిలాగ గుంపులు గుంపులుగా విచ్చలవిడిగా ప్రయాణం చేస్తే ఇప్పుడు మొదటికే మోసం రావొచ్చు. అందుకే గమ్యస్థానాన్ని త్వరగా చేరుకోవాలన్న ఉద్దేశంతో కాకుండా.. క్షేమంగా, సురక్షితంగా చేరుకోవాలని కోరుకుంటూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడంతో పాటు స్వయంగా పాటించాల్సిన కొన్ని విధివిధానాల గురించి తెలుసుకుందాం!

వెంటిలేషన్ ముఖ్యం..

గాలి రేణువుల ద్వారా వ్యాపించే ఈ కరోనా వైరస్.. దరిచేరకుండా ఉండాలంటే ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ వెంటిలేషన్ వచ్చే చోటులో కూర్చోవడం మంచిది. అంటే బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కిటికీ దగ్గర, లేదా బాగా గాలి తగిలే ప్రదేశంలో కూర్చోవాలి. వీలైనంత వరకు సొంత బైక్, సొంత కారులో వెళ్లడం అలవాటు చేసుకోవాలి. అలా ప్రయాణిస్తున్నపుడు కూడా వెంటిలేషన్ చాలా ముఖ్యం. మెట్రో రైళ్లలో, విమానాల్లో ఎయిర్ ఫిల్టర్ వెంటిలేషన్ సౌకర్యం ఎలాగూ ఉంటుంది కాబట్టి వాటిల్లో ప్రయాణిస్తున్నపుడు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉండదు.

నిశ్శబ్దం తప్పనిసరి..

ప్రయాణించే అందరికీ వెంటిలేషన్ సౌకర్యం ఉన్న ప్రదేశాల్లో కూర్చునే లేదా నిల్చునే అవకాశం రాకపోవచ్చు. అలాంటివారు తప్పనిసరిగా నిశ్శబ్ధం పాటించాలి. ఎదుటి వారు మాట్లాడుతున్నా వారిని మాట్లాడవద్దని సైగ చేసి చెప్పాలి. ఎందుకంటే మాట్లాడినప్పుడు తుంపర్లు విడుదలై అవి ఆ బస్సులో లేదా వాహనంలో తోటిప్రయాణికుల మీద పడవచ్చు. అంతేకాకుండా బస్సులో సీట్ల మీద, ఇతర కడ్డీల మీద పడవచ్చు. ఎలాగూ మాస్క్ ధరించాం కదా.. మాట్లాడితే ఏమవుతుందనే తప్పుడు అభిప్రాయం వద్దు. అన్ని మాస్కులు 100 శాతం కచ్చితత్వంతో పనిచేయవు. కాబట్టి ఆ ఒక్క ప్రయాణ వ్యవధిలో మాట్లాడకపోతే కొంపలు మునిగిపోవు. అందుకే ఎంత నిశ్శబ్ధంగా ఉండగలిగితే అంత మంచిది.

ఎక్కాలా? వద్దా?

అత్యవసర పరిస్థితిలో ఉన్నపుడు సొంతంగా కారు గానీ, బైక్ గానీ తీసుకెళ్తే మంచిది. ఒకవేళ ఎలాంటి అత్యవసర పరిస్థితి లేనట్లయితే ఆచితూచి వాహనాలు ఎక్కడం ముఖ్యం. తక్కువ మంది జనం ఉన్న బస్సు వచ్చే వరకు ఎదురు చూడాలి. ఎక్కిన తర్వాతసామాజిక దూరం పాటించేలా సీటును ఎంచుకోవాలి. వెళ్లేది కొద్దీ దూరమే కదా.. ఒకరి పక్కన ఖాళీగా ఉంది కదా అని వారి పక్కన వెళ్లి కూర్చోకూడదు. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాపించడానికి ఒక్క క్షణం చాలు. అలాగే దూర ప్రయాణాలు చేసే క్రమంలో కూడా తరచుగా మీ సీటు చుట్టుపక్కల శానిటైజ్ చేసుకోవడంతో పాటు మీ చేతులను, మాస్క్‌ను కూడా శానిటైజ్ చేస్తుండాలి.

మరి నిల్చునే వాళ్ల సంగతి?

బస్సులు, రైళ్లు, మెట్రోల్లో అందరికీ సీట్లు దొరకకపోవచ్చు. ఎంత సామాజిక దూరం పాటించినా కనీసం పది మందైనా నిలబడక తప్పని పరిస్థితి. అయితే కూర్చున్న వాళ్ల కంటే నిలబడే వాళ్లకు సరైన స్థానాన్ని ఎంచుకోవడంలో చాలా అవకాశాలు ఉంటాయి. నిలబడాలనుకునేవారు ఖాళీగా ఉన్న స్థానానికి వెళ్లి నిలబడాలి. ముఖ్యంగా తలుపుల దగ్గర, కిటికీల దగ్గరగా నిల్చోవాలి. మగవాళ్ల పక్కన కంటే ఆడవాళ్ల పక్కన నిల్చోవడానికి ప్రాధాన్యతనివ్వండి. ఎందుకంటే మగవాళ్లు తరచుగా చేతులు కడుక్కోరు. అదే మహిళలు అయితే ఎక్కువసార్లు చేతులను శానిటైజ్ చేసుకుంటారు. వీలైనంత మేరకు బస్సులో కడ్డీలకు చేతులు తగలనివ్వకుండా కాళ్లను దేనికైనా సపోర్టుగా ఉంచి నిల్చోవడం ఉత్తమం.


Next Story

Most Viewed