డిమాండ్ స్థాయిలో ట్రాక్టర్ల ఉత్పత్తి లేదు

by  |
డిమాండ్ స్థాయిలో ట్రాక్టర్ల ఉత్పత్తి లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కారణంగా అన్ని రంగాలు డీలాపడిన సంగతి తెలిసిందే. అయితే, ఆటో మొబైల్ రంగం (Auto mobile sector) మాత్రమే తక్కువ వ్యవధిలో పుంజుకోవడం భవిష్యత్తు ఆశలను రేకెత్తిస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ట్రాక్టర్ అమ్మకాలు మిగిలిన అన్ని విభాగాల కంటే అత్యధిక వృద్ధిని సాధిస్తున్నాయి. రానున్న పండుగ సీజన్ సమయానికి ట్రాక్టర్ల విక్రయాలు గతం కంటే మెరుగ్గా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే, గతేడాదితో పోలిస్తే ఉత్పత్తి పెరిగినా డిమాండ్ ఇంకా అధికంగా ఉందని, ఆ స్థాయిలో ఉత్పత్తి జరగాలని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. కరోనా ప్రభావంతో దేశం నలుమూలల నుంచి వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లడంతో పాటు, వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులు వ్యవసాయ యాంత్రీకరణకు దారితీశాయని, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ట్రాక్టర్ అమ్మకాలు దాదాపు 5 శాతం పెరగడం దీనికి సాక్ష్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్రాక్టర్ అండ్ మెకానైజేషన్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. దేశంలోని అన్ని పరిశ్రమలు మొత్తం 86,999 యూనిట్ల ట్రాక్టర్లను ఉత్పత్తి చేయగా, వీటిలో 72,581 యూనిట్ల విక్రయాలు జరిగాయని, అలాగే 7,852 యూనిట్ల ఎగుమతులు నమోదయ్యాయని తెలుస్తోంది. 2019, ఆగస్టులో ఆటోమొబైల్ పరిశ్రమ (Auto mobile sector) మొత్తం 70,039 యూనిట్ల ట్రాక్టర్లను ఉత్పత్తి చేయగా 44,030 యూనిట్లను విక్రయించగలిగింది. వీటిలో సుమారు 6,900 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ఈ గణాంకాలను బట్టి ట్రాక్టర్ తయారీ సంస్థలు పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని దక్కించుకున్నప్పటికీ డిమాండ్‌కు తగిన స్థాయి ఓ మార్కెట్లోకి తీసుకురావడంలో వెనకబడ్డాయని నిపుణులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed