కరోనా పెషంట్ ఇంట్లో దొంగతనం…

by  |
కరోనా పెషంట్ ఇంట్లో దొంగతనం…
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలోని ఓ వ్యక్తికి ఇటీవల కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ వ్యక్తి క్వారంటైన్‌లోకి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన అతని స్నేహితులు ఇంట్లో చోరీ చేశారు. చివరకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామానికి చెందిన చీదెళ్ల సత్యనారాయణ కుటుంబంలో ఒకరికి జూలై నెలలో కరోనా వైరస్ సోకింది. దీంతో వారు క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇదే గ్రామానికి చెందిన షేక్ నాగుల్ మీరా, షేక్ నజీర్, పఠాన్ మోదీన్, హుజూర్‌నగర్‌లోని అంబేద్కర్ కాలనీకి చెందిన మహమ్మద్ జలాల్ పాష అలియాస్ బాబాలు ఆ కుటుంబ సభ్యులు క్వారంటైన్‌లోకి వెళ్లడాన్ని గమనించారు.

ఇదే అదునుగా భావించి జూలై 27వ తేదీన సత్యనారాయణ ఇంటిలోని బీరువా లాకర్‌ను పగలగొట్టి 14 రకాల బంగారు ఆభరణాలు(30 తులాలు) చోరీ చేశారు. క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత ఇంటి యాజమాని ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం హుజూర్‌నగర్ సీఐ రాఘవరావు తన సిబ్బందితో కలిసి పట్టణ శివారులోని ధనలక్ష్మీ ఫంక్షన్ హాల్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అటుగా వచ్చిన మఠంపల్లి మండలం పెదవీడు గ్రామానికి చెందిన పఠాన్ మోదీన్, హుజూర్‌నగర్‌లోని అంబేద్కర్ కాలనీకి చెందిన మహమ్మద్ జలాల్ పాషా లింగగిరి వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. పోలీసులకు అనుమానం వచ్చి వారిని తనిఖీ చేయగా, వారి వద్ద కొన్ని బంగారు వస్తువులు దొరికాయి.

దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పెదవీడు గ్రామానికి చెందిన మిగతా ఇద్దరు నిందితులు షేక్ నాగుల్ మీరా, షేక్ నజీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించడంతో వారి వద్ద నుంచి చీదేళ్ల సత్యనారాయణ ఇంటిలో దొంగిలించిన 30 తులాల బంగారంతో పాటు మరో 30 తులాల బంగారపు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పెదవీడు గ్రామానికి చెందిన నాగుల్ మీరాపై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఎస్పీ భాస్కరన్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక అందుబాలోకి వచ్చిందని, ఎవరూ ఎటువంటి నేరానికి పాల్పడినా పోలీసులకు దొరికిపోవడం ఖాయమని చెప్పారు. అనవసరంగా నేరాలకు పాల్పడి జైలు పాలుకావొద్దని ఎస్పీ భాస్కరన్ సూచించారు. కేసును చేధించిన హుజూర్‌నగర్ సీఐ రాఘవరావు బృందాన్ని అభినందించారు. మీడియా సమావేశంలో కోదాడ డీఎస్పీ రఘు, మఠంపల్లి సీఐ విష్ణు, పోలీసులు సిబ్బంది ఉన్నారు.


Next Story

Most Viewed