చేసేదిలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య

by  |
చేసేదిలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య
X

దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: ఆర్థిక సమస్యలు ఓ యువ చేనేత కార్మికుడి ప్రాణాలు తీశాయి. అప్పులకు రోజురోజుకు వడ్డీలు పెరగడం… చేసిన పనికి గిట్టుబాటు రాక వడ్డీలు విపరీతంగా పెరిగిపోయి యువకుడిని కుంగదీశాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత లాక్ డౌన్ సందర్భంగా మగ్గాలు నడవడం లేదు. దీంతో ఉపాధి లేక తిండికి కరువై, పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యలు పెరగడంతో చేసేదిలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉమ్మడి పాలమూరు లోని నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామంలో సాక రాకేష్(28) అనే యువకుడు మంగళవారం రాత్రి కోటకొండ గ్రామం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ప్రకారం.. కోటకొండ గ్రామ వాసి రాకేష్ కు సమీప బంధువు తో వివాహం జరిగింది. భార్య అరుణ(25 ), కూతురు మానస(2 ) ఉన్నారు. అయితే కులవృత్తి అయిన చేనేత పైనే ఆధారపడి మగ్గం నేస్తూ జీవనం సాగించేవాడు. నేత పనిపై ఎంతకు గిట్టుబాటు కాకపోవడంతో కుటుంబాన్ని గడిపేందుకు అప్పులు చేశాడు. యువకుడి తల్లిదండ్రుల అనారోగ్యం కారణంగా ఆసుపత్రులలో కూడా డబ్బు ఖర్చు అయింది. అవి వడ్డీలు పెరిగి పెరిగి మోయలేని భారంతో కుంగదీశాయి. చేస్తున్న పనికి గిట్టుబాటు ధర రాక పోవడం.. కుటుంబ పోషణ మరింత భారం కావడంతో దిక్కుతోచని స్థితిలో మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయి, ఊరు చివరన చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఉదయం లేచి బాటసారులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడి చేరుకుని చెట్టుకు వేలాడి ఉన్న రాకేశ్ ను చూసి కన్నీరుమున్నీరయ్యారు.


Next Story

Most Viewed