ఓట్ల కోసం వచ్చినప్పుడే నీటి సమస్య తీరుస్తారా?

by Shyam |
ఓట్ల కోసం వచ్చినప్పుడే నీటి సమస్య తీరుస్తారా?
X

దిశ, కామారెడ్డి: సర్పంచ్ ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి ముఖం చాటేస్తారా అంటూ మహిళలు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. అంగడిబజార్‌లో నీటి సమస్య తీర్చకపోవడంతో పాత జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. సర్పంచ్ తునికి వేణుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్పంచ్ వచ్చే వరకు, నీటి సమస్య తీరేవరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు.

ఈ సందర్బంగా మహిళలు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తమ వాడకు వచ్చి నీటి సమస్య తీరుస్తామని చెప్పిన సర్పంచ్ తునికి వేణు ఇప్పుడు ఆ సమస్యలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారా అని నిలదీశారు. వెంటనే తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. బోరు వసతి ఉన్నవాళ్లు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని, మీకు నల్లలు ఉన్నాయి కదా అంటూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతనైన వాళ్ళు ఎక్కడినుంచైనా నీళ్లు తెచ్చుకుంటారని, వృద్ధుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించడం చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed