‘అసలు రౌడీని వదిలి.. మమ్మల్ని వేధిస్తున్నారు’

by  |
‘అసలు రౌడీని వదిలి.. మమ్మల్ని వేధిస్తున్నారు’
X

దిశ, హైదరాబాద్: నేర చరిత్ర లేని తన కుమారున్ని పోలీసులు రౌడీగా చూపుతూ వేధింపులకు గురి చేస్తున్న గోల్కొండ పోలీసులపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని ఓ తల్లి బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ని ఆశ్రయించింది. బాధితురాలు నస్రీన్ బేగం చేసిన ఫిర్యాదు ప్రకారం… సుమారు నాలుగేళ్ల క్రితం బంజారాహిల్స్ పోలీసులు హకీంపేట కుంటకు చెందిన జావీద్ అనే వ్యక్తిపై రౌడీ షీట్ తెరచి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే నిజమైన రౌడీషీటర్లను వదిలి.. అదే పేరుతో ఉన్న తన కుమారున్ని తరచుగా గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు వేదింపులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. ఇన్‌స్సెక్టర్ మారిన ప్రతిసారి తన కుమారున్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. దీంతో తాను కూడా తరచూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమారునికి నేర చరిత్ర లేదని.. వివరాలు పోలీసుల దృష్టకి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. అయినా పోలీసులు తమ తీరు మార్చుకోకుండా అసలు రౌడీ షీటర్‌ను వదలి తన కుమారున్ని వేధిస్తున్నారని, ఈ విషయంలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని ఆమె హెచ్‌ఆర్సీని కోరింది. దీనికి స్పందించిన హెచ్ఆర్సీ ఆగస్టు 10వ తేదీలోగా విచారణ నివేదిక కమిషన్‌కు అందజేయాలని పశ్చిమ మండలం డీసీపీకి ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed