రామప్పకు ముప్పు.. సింగరేణి యాజమాన్యం క్లారిటీ

by  |
Singareni
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ప్రపంచ వారసత్వ సంపదగా ఎంపికైన రామప్ప గుడికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేద‌ని సింగ‌రేణి యాజ‌మాన్యం స్పష్టం చేసింది. కొన్ని వార్తా ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాలు, సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్రచారంపై శుక్రవారం యాజ‌మాన్యం స్పందించింది. ఈ మేర‌కు ఓ ప‌త్రిక ప్రక‌ట‌న‌ విడుద‌ల చేసింది. సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురంలో చేపట్టాలని తలపెట్టిన వెంకటాపురం ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉందని తెలిపింది.

యునెస్కో రామప్పను వారసత్వ సంపదగా ప్రకటించిన నేపథ్యంలో వెంకటాపురం ప్రాజెక్టుపై మరింత సమగ్రంగా శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే ముందుకెళ్లాని నిర్ణయించుకున్నట్లు వివ‌రించింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని పేర్కొంది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి తెలంగాణకు చెందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి చిన్న నష్టం చేకూర్చే ఎటువంటి ప్రతిపాదన చేయబోదని, దీని పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉంటుందని తెలిపింది. దీనిపై ఎటువంటి అపోహలకు తావులేదని, అవాస్తవాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

Next Story

Most Viewed