తండ్రిని గొంతుపై కాలితో తొక్కి…! 

by  |
తండ్రిని గొంతుపై కాలితో తొక్కి…! 
X

దిశ, ఏపీ బ్యూరో : రూపాయి.. రూపాయి నువ్వేం చేస్తావంటే కన్నతండ్రినే చంపమంది. పేగు బంధాన్ని గేలిచేసింది. వేలు పట్టి నడిపించిన కన్నతండ్రిని గొంతుపై కాలితో తొక్కి ఊపిరి తీసింది. ఆస్తి కోసం కన్న తండ్రినే కర్కశంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడులో శనివారం వెలుగు చూసింది.

70 ఏళ్ల వృద్ధుడిని కర్రతో దాడిచేసి కాలితో గొంతుపై తొక్కి చంపడం అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గరికపాడుకు చెందిన తూమాటి సుబ్బారావుకు నలుగురు కుమారులు. మొదటి కుమారుడు తూమాటి బ్రహ్మయ్య చనిపోయాడు. సుబ్బారావు తన రెండో కుమారుడు తూమాటి ఆదెయ్య వద్దనే కాలం వెళ్లదీస్తున్నాడు.

ఆస్తి పంపకాల వ్యవహారంలో వివాదం చెలరేగింది. తనకున్న 10 ఎకరాల పొలంలో నలుగురు కుమారులకు గతంలోనే ఒక్కో ఎకరం చొప్పున పంచేశాడు. మిగిలిన 6 ఎకరాలను సమానంగా పంపిణీ చేసి మిగిలి ఉన్న ఇంటిని తన పోషణ చూసుకుంటున్న రెండో కుమారుడు ఆదెయ్యకు రాసిస్తానని చెప్పడం వివాదంగా మారింది.

దీనికి ఒప్పుకోని మూడో కుమారుడు వెంకటేశ్వరరావు, నాలుగో కుమారుడు తూమాటి గోవిందయ్య శుక్రవారం మధ్యాహ్నం తండ్రిపై కర్రతో దాడిచేయడంతో పాటు గొంతుపై కాలువేసి తొక్కడంతో కోమాలోకి వెళ్లాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. తూమాటి ఆదెయ్య భార్య ఉమామహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సీహెచ్‌ రాజశేఖర్‌ తెలిపారు.


Next Story

Most Viewed