తహసీల్దార్ నిర్లక్ష్యం.. ముదిరిన వివాదం.. మంత్రి జోక్యం

by  |
తహసీల్దార్ నిర్లక్ష్యం.. ముదిరిన వివాదం.. మంత్రి జోక్యం
X

దిశ, వనపర్తి: పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి గ్రామంలో ఇండ్ల స్థలాల వివాదం ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం తహసీల్దార్ ఘాన్సీ‌రామ్‌ను గ్రామ దళితులు కలిసి తమకు సంబంధించిన భూమి తమకే కెటాయించి న్యాయం చేయాలని కోరారు. సర్వే నెంబరు 176, 177లకు చెందిన రికార్డులు ప్రతికాపీలు కావాలని అడుగుగా అనుచితంగా ప్రదర్శించారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏమీ ఇవ్వాలని లేదు మీ ఇష్టం’ అంటూ తహసీల్దార్ నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఒక అధికారి ఇలా ప్రవర్తించటం సరికాదని అన్నారు. ఆయన ప్రవర్తనకు నిరసనగా వివాదస్థలంలో శనివారం రాత్రి దళితులు గుడిసెలు వేశారు. గ్రామ రెవెన్యూ అధికారి గుడిసెలు వేయవద్దని ఆదేశించారు. ఇదిలా ఉండగా తహసీల్దార్ ఫిర్యాదు మేరకు స్థానిక దళితులను ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం వరకూ వారిని పోలీసులు వదలకపోవటంతో గ్రామస్తులు రాస్తారోకోకుసమాయత్తం అయ్యారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పెబ్బేరు స్టేషన్‌లో ఉన్న బాధితుడు గంధం శరత్ బాబుతో ఫోన్‌లో మాట్లాడారు. తన ఢిల్లీ పర్యటన అనంతరం అందరితో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుని దళితులకు అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. మంత్రితో చర్చలు జరిపిన తర్వాత న్యాయం జరగకపోతే తదుపరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.


Next Story

Most Viewed