దారుణం.. గర్భిణిని పొలంలో పాతిపెట్టిన భర్త

by  |
దారుణం.. గర్భిణిని పొలంలో పాతిపెట్టిన భర్త
X

దిశ, అమరావతి బ్యూరో: గర్భిణి అయిన భార్యను హత్య చేసి మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టేశాడు ఓ ఆగంతకుడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా హొళగుంద మండలం సమ్మతగేరి మజరా గ్రామం ముగుమానుగుందిలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన బసవరాజుకు ఆస్పరి మండలం కైరుప్పల గ్రామానికి చెందిన వీణ అలియాస్‌ మీనాక్షి (28)తో పదేళ్ల క్రితం పెళ్లి అయింది. ఇటీవల బసవరాజుకు భార్య మీద అనుమానం మొదలైంది. దీంతో మీనాక్షిని వేధించేవాడు. ఈ క్రమంలో జూన్‌ 2వ తేదీ నుంచి మీనాక్షి కనిపించకుండా పోయింది. ఈ విషయం తెలిసి ఆమె పుట్టింటివారు బసవరాజుతో మాట్లాడటానికి ఫోన్‌ ద్వారా ప్రయత్నించారు. వీణ 2వ తేదీనే కైరుప్పల బయల్దేరిందని 17వ తేదీన బసవరాజు ఫోన్‌లో బుకాయించాడు. దీంతో మీనాక్షి తండ్రి బీరప్ప తన కూతురు కనిపించడం లేదని హొళగుంద పోలీస్‌ స్టేషన్‌లో అల్లుడి మీద ఫిర్యాదు చేశాడు. పోలీసులు బసవరాజును అదుపులోకి తీసుకుని విచారించారు.

భార్యను చంపి పొలంలో పాతిపెట్టానని బసవరాజు అంగీరించినట్లు పోలీసులు తెలిపారు. తహసీల్దార్‌ అన్వర్‌హుసేన్‌, ట్రైనీ డీఎస్పీ జయరాం, కర్నూలుకు చెందిన వైద్యాధికారి రాజశేఖర్‌, ఆలూరు సీఐ భాస్కర్‌, చిప్పగిరి, హొళగుంద ఎస్‌ఐలు జహీర్‌అహ్మద్‌, విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమెకు ఐదు సంవత్సరాల కొడుకు శశికుమార్‌ ఉన్నాడు. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫోరెన్సిక్‌ నివేదికలో మిగతా వివరాలు తెలుస్తాయని పోలీసులు అన్నారు.


Next Story

Most Viewed