పెళ్లైన 28రోజులకే వరుడు మృతి

by  |
పెళ్లైన 28రోజులకే వరుడు మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: పెళ్లైన 28రోజులకే వరుడు మృతిచెందిన సంఘటన తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణా నది రైల్వే బ్రిడ్జి కింద ఆదివారం చోటుచేసుకుంది. విజయవాడ మాచవరం డౌన్‌ నివాసి గరికె కోటా వెంకట వరప్రసాద్, లక్ష్మి దంపతుల పెద్దకొడుకైన గరికె సాయిఫకీర్‌ (22), తండ్రి చనిపోవడంతో ఎల్రక్టీషియన్‌ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత నెల 8న తాడేపల్లికి చెందిన వైష్ణవితో వివాహమైంది. పెళ్లైన 28రోజుల తర్వాత స్నేహితులు పార్టీ అడగడంతో సాయిఫకీర్‌ విజయవాడలో పార్టీ చేసుకుని స్నేహితులతో సాయంత్రం కృష్ణానదికి చేరాడు. స్నానం చేసేందుకు పుష్కర ఘాట్ల పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జి దగ్గర నీటిలోకి దిగారు. సరదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా సాయిఫకీర్‌ నీళ్లలోకి జారిపోయాడు.

స్నేహితులు వెదికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో మంగళగిరి అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బోటు సాయంతో సాయిఫకీర్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న వైష్ణవి భోరున విలపించింది. భర్త బతికే ఉన్నాడని, ఆసుపత్రికి తీసుకువెళ్లండంటూ దుఃఖించడం కలచివేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా సాయి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి లేకున్నా సాయిఫకీర్‌ తల్లి, తమ్ముణ్ణి పోషిస్తున్నాడు. వివాహం చేసుకున్న ఆనంద క్షణాల్లోనే ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. తాడేపల్లి టౌన్‌ సీఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed