బాలీవుడ్‌లో డ్రగ్స్.. టాలీవుడ్ షేక్

by  |
బాలీవుడ్‌లో డ్రగ్స్.. టాలీవుడ్ షేక్
X

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ సూసైడ్ కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి రావడంతో దేశంలోని పలు సినీ ఇండస్ట్రీలు షేక్ అవుతున్నాయి. సూసైడ్ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూడటం దేశ వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఇందులో రియా చక్రవర్తిని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు విచారిస్తున్న సమయంలో హఠాత్తుగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటపడడంతో తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయింది.

అంతేకాకుండా, మరో 25 మంది సినీ ప్రముఖుల పేర్లను రియా చక్రవర్తి అధికారులకు వెల్లడించిందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఎన్సీబీ విచారణ ప్రకంపనలకు దారి తీసింది. డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్ల పేర్లు వచ్చిన ఆశ్చర్యపడే అవకాశం లేదని.. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చేందుకు ఎన్సీబీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రకుల్ పేరు తొలుత వార్తల్లో నిలవడంతో.. వికారాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌‌లో ఉన్న ఆమె మధ్యలో నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లినట్టు సమాచారం. అలాగే మరో మూడు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొనను అని చిత్ర యూనిట్‌కు చెప్పడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ మేనేజర్ మాత్రం ఇదంతా తప్పుడు సమాచారం అంటూ తీసి పడేస్తున్నారు. కావాలనే పెద్ద కుట్ర చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు.

అయినప్పటికీ.. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు రియా ఇచ్చిన సమాచారంతో కూపీ లాగుతున్నారు. బాలీవుడ్‌లో సంచలనం రేపిన డ్రగ్స్‌కేసు టాలీవుడ్‌కు పాకడం.. మరోవైపు స్యాండల్‌వుడ్‌ బ్యూటీలు డ్రగ్స్ తీసుకున్నారని వార్త వెలుగులోకి రావడంతో అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ కేసు దేశంలోనే సంచలనం సృష్టిస్తోంది.


Next Story

Most Viewed