బోణి కొట్టిన బంగ్లా.. ప్రపంచ‌కప్‌లో తొలిసారి పాక్‌పై విజయం

by Harish |
బోణి కొట్టిన బంగ్లా.. ప్రపంచ‌కప్‌లో తొలిసారి పాక్‌పై విజయం
X

హోమిల్టన్ : ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం హోమిల్టన్ వేదికగా సెడాన్ పార్క్ మైదానంలో బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌తో తలపడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 234/7 పరుగుల వద్ద కట్టడి చేసింది. బంగ్లా విధించిన లక్ష్య ఛేదనలో పాక్ ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. సిద్రా అమీన్ 104(140)పరుగులతో చెలరేగినప్పటికీ బంగ్లా బౌలర్లు చివరకు కట్టడి చేయడంతో పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 225/9 పరుగులు మాత్రమే చేయగలిగింది.

బంగ్లా టీములో ఫహిమా ఖాటూన్ 3/30 వికెట్లు తీసి పాకిస్తాన్ పతనాన్ని శాసించగా, 9 పరుగుల తేడాతో వరల్డ్ కప్ చరిత్రలోనే బంగ్లాదేశ్ మహిళల జట్టు తొలిసారిగా పాకిస్తాన్‌పై విజయం సాధించింది. కాగా, 2022 ఐసీసీ వరల్డ్ కప్‌లో పాక్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది.

Next Story