- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బ్యాంకాక్లో ఉద్యోగాల ఎర.. సైబర్ ఉచ్చులో తెలుగు యువత.. విముక్తి కల్పించిన బండి సంజయ్

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Bangkok) బ్యాంకాక్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి మయన్మార్ (Myanmar) కేంద్రంగా (Cyber Fraud Cafe) సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న తెలంగాణకు చెందిన యువతకు విముక్తి లభించింది. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్లో మంచి జాబ్ ఉందని, ప్రతినెలా లక్షల రూపాయల జీతం వస్తుందని బ్రోకర్ ఆశ చూపడంతో వీరంతా నిజమేనని నమ్మి మోసపోయారు.
ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడకు చెందిన మయన్మార్ బాధితుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ‘మా ఏరియాలో ఉండే వ్యక్తి బ్యాంకాక్లో మంచి ఉద్యోగం ఉందని ఆశ చూపడంతో నిజమేనని నమ్మిన. జగిత్యాలలోని బ్రోకర్ల ఏజెంట్ (టీమ్ లీడర్) వంశీక్రిష్ణ వద్దకు తీసుకుపోయిండు. వంశీకృష్ణ నన్ను ఇంటర్వ్యూ చేశాడు. బ్యాంకాక్కు 200 కిలోమీటర్ల దూరంలోనే జాబ్ అని చెప్పి తీసుకుపోయారు. తీరా అక్కడికిపోతే రోజుకు 16 గంటల పని అప్పగించారు. ఆ పని ఏందంటే సైబర్ క్రైమ్. ఆ పని చేయకపోతే భోజనం కూడా పెట్టకపోయేవాళ్లు. 5 నెలలు ఆ కంపెనీలో పనిచేసిన. అలాంటి పని చేయడం నాకిష్టం లేదని చెప్పిన. దీంతో అక్కడున్న చైనీస్ వాళ్లు నా పాస్ పోర్టు గుంజుకున్నారు. అన్నం కూడా పెట్టకుండా హింసించారు. అయినా వినకపోవడంతో వాళ్లు అక్కడున్న ఆర్మీ వాళ్లకు చెప్పి మేం దొంగతనంగా ఆ దేశానికి వచ్చామని చెప్పి ఆర్మీ వాళ్లకు పట్టించారు. వాళ్లు మమ్మల్ని జైల్లో వేశారు’ అని వాపోయారు. ఇటీవల మయన్మార్ నుంచి వందలాది మంది తన లాంటి బాధితులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వదేశానికి రప్పించారని తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చానని రాకేష్ రెడ్డి తెలిపారు.
‘మా నాన్న బండి సంజయ్ సార్కు లెటర్ రాసిన వెంటనే స్పందించి విదేశాంగ శాఖకు లేఖ రాయడంతో పాటు వెంటనే మమ్మల్ని స్వదేశానికి రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కేంద్ర మంత్రికి మా కుటుంబమంతా రుణపడి ఉంటది’ అని పేర్కొన్నారు. రాకేశ్ రెడ్డితోపాటు కోహెడకు చెందిన ఏ.శివశంకర్, కరీంనగర్ జిల్లాకు చెందిన కానూరి గణేశ్ తోపాటు ఏపీకి చెందిన ఆకుల గురు యువ కిశోర్ బ్రోకర్ల బారిన పడి మయన్మార్ లో సైబర్ క్రైమ్ వెట్టి చాకిరి చేస్తూ తీవ్రమైన హింసలకు గురయ్యారు. వీరంతా బండి సంజయ్ కార్యాలయ చొరవతో స్వదేశానికి తిరిగి రావడం గమనార్హం. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మయన్మార్ లో పలువురు తెలుగు రాష్ట్రాల యువతతోపాటు వందలాది మంది భారతీయులు సైబర్ క్రైమ్ వెట్టి చాకిరి చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, త్వరలోనే వారందరినీ స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బ్రోకర్ల వలలో పడి మోసపోవద్దని యువతకు బండి సంజయ్ సూచనలు చేశారు.