BRS : డ్యామిట్.. అసెంబ్లీలో బెడిసి కొట్టిన బీఆర్ఎస్ వ్యూహం..!

by Rajesh |
BRS : డ్యామిట్.. అసెంబ్లీలో బెడిసి కొట్టిన బీఆర్ఎస్ వ్యూహం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యూహాలు బెడిసి కొట్టాయి. సబితా ఇంద్రారెడ్డిని సీఎం అవమానపరిచారని క్షమాపణలు చెప్పాలని సభ ప్రారంభం నుంచి ఆందోళనకు దిగిన గులాబీ ఎమ్మెల్యేలకు స్పీకర్ మైక్ ఇవ్వలేదు. అదేపనిగా సభా కార్యక్రమాలను అడ్డుకుంటే సభ నుంచి సస్పెండ్ చేస్తారని ఆశించారు. అయితే ప్రభుత్వం మాత్రం సస్పెన్షన్ జోలికి వెళ్లకపోవడంతో సడన్‌గా వ్యూహం మార్చి, సీఎం చాంబర్ ముందు ఆందోళనకు దిగారు. అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుకున్నంత మైలేజ్ మాత్రం రాలేదన్న చర్చ జరగుతున్నది.

సడన్‌గా స్ట్రాటజీ చేంజ్

మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని అసెంబ్లీ ప్రారంభం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అయితే ఈలోపు ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తుది తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం ఆ అంశంపై స్టేట్ మెంట్ ఇచ్చింది. దీనిపై అన్ని పక్షాలు తమ అభిప్రాయాలు చెప్పాలని స్పీకర్ సూచించారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం సబిత అంశంపైనే ఆందోళనలు కొనసాగించారు.

ఎస్సీ వర్గీకరణకు గులాబీ పార్టీ వ్యతిరేకమా? ఎవరూ మాట్లాడరా? అని అధికార పార్టీ నుంచి విమర్శలు రావడంతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వర్గీకరణను స్వాగతించారు. అయితే సబితా అంశంపై మాట్లాడే చాన్స్ స్పీకర్ ఇవ్వకపోవడంతో హరీశ్ రావు వ్యూహాన్ని చేంజ్ చేశారు. సభలో మిగతా పక్షాలు మాట్లాడుతున్న సమయంలో ఓవైపు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో సభలో నిరసన చేయిస్తూ, మరోవైపు మిగతా ఎమ్మెల్యేలతో కలిసి బయటికి వచ్చారు. సడన్‌గా సీఎం చాంబర్ ముందుకు వెళ్లి బైఠాయించి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో, మార్షల్స్ వచ్చి బయటికి తీసుకొచ్చారు. అయితే సభ కార్యక్రమాలను అడ్డుకుంటే తమను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందన్న అంచనాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన ప్లాన్ బెడిసికొట్టిందన్న చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed